Begin typing your search above and press return to search.

వ‌దిలిపెట్ట‌ను...ఆ పుకార్లు న‌మ్మ‌ద్దంటున్న క‌విత‌

By:  Tupaki Desk   |   27 May 2019 3:51 PM GMT
వ‌దిలిపెట్ట‌ను...ఆ పుకార్లు న‌మ్మ‌ద్దంటున్న క‌విత‌
X
అన్ని వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించిన నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో...తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య - తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రాజ‌యం టీఆర్ ఎస్ శ్రేణుల‌ను ఓ కుదుపు కుదిపేసింది. ఈ ఎపిసోడ్‌ పై తాజాగా క‌విత స్పందించారు.ఇటీవల మృతి చెందిన టీఆర్‌ ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని కవిత ఇవాళ పరామర్శించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ - తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. నిజామాబాద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొంటూ...హుజూర్‌ న‌గ‌ర్ బ‌రిలో నిల‌వ‌డంపై స్ప‌ష్టత ఇచ్చారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి - టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ ఎంపీ కవిత పర్యటించారు. చనిపోయిన టీఆర్ ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలో ఓటమి ఫలితాలతో కలత చెంది.. గత 3 రోజులుగా మనస్తాపానికి లోనై ఇవాళ హార్ట్ ఎటాక్ తో కిశోర్ చనిపోయాడనీ.. ఆయన కుటుంబానికి టీఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె చెప్పారు. త‌న ఓట‌మి గురించి వెల్ల‌డిస్తూ....``తెలంగాణ కోసమైనా.. నిజామాబాద్ కోసమైనా.. కార్యకర్తలు, ప్రజల కోసమైనా.. పదవిలో ఉన్నా లేకున్నా.. తప్పకుండా పనిచేస్తా.నాది నిజామాబాదే. నిజామాబాద్ లోనే ఉంటాను. నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదు” అని ప్ర‌క‌టించారు.

కేంద్రంలో బీజేపీ రావాలనే వారికి ఓటేశారని క‌విత ప్ర‌క‌టించారు. “ఎన్నికల్లో ప్రజలు టీఆర్ ఎస్ పార్టీని కాదని.. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో బీజేపీ పట్ల మొగ్గు చూపించారు. మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీపైన అనేక మైన ఆశలు ప్రజలు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. నిజామాబాద్ లో ఉండేటువంటి ప్రత్యేకమైన ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన ఎంపీ నెరవేర్చాలని ఆశిస్తున్నాం. పదవులు ఉన్నా లేకున్నా.. టీఆర్ ఎస్ పార్టీ - తెలంగాణ రాష్ట్ర బాగు కోసం పనిచేసే వ్యక్తిని నేను. కేడర్ ధైర్యం కోల్పోవద్దు. ఓటమిలో హుందాగా ఉండాలనేది తెలంగాణ ఉద్యమమే మనకు నేర్పించింది” అని అన్నారు. “తెలంగాణ ప్రజలకు - నిజామాబాద్ ప్రజలకు ఓ విషయం చెబుతున్నా. రాజకీయాల్లో - ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఉంటాయి. ఒడిదొడుకులు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ అనేది… పదవుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే పార్టీ. పదవులు ఉన్నా లేకపోయినా… ప్రజల కోసం పనిచేయాలి`` అంటూ క‌విత కార్య‌క‌ర్త‌ల‌కు హిత‌బోధ చేశారు.