Begin typing your search above and press return to search.

తాను హోంమంత్రి అయితే మేధావుల్ని చంపేస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   27 July 2018 9:11 AM GMT
తాను హోంమంత్రి అయితే మేధావుల్ని చంపేస్తాడ‌ట‌!
X
అధికారం అన్న‌ది ఆభ‌ర‌ణంలా ఉండాలి. కానీ.. అహంకారంగా మార‌కూడ‌దు. ఆ విష‌యంలో బీజేపీ నేత‌లు త‌మ హ‌ద్దుల్ని పూర్తిగా దాటేస్తున్నారు. తాము చేసే వ్యాఖ్య‌ల కార‌ణంగా పార్టీకి జ‌రిగే న‌ష్టం గురించి వారు అస్స‌లు ఆలోచించ‌న‌ట్లుగా క‌నిపిస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ముకుతాడు వేయాల‌ని ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు తెగ ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఆ పార్టీ నేత‌ల నోటికి మాత్రం తాళాలు ప‌డ‌టం లేదు.

తాజాగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడో ఎమ్మెల్యే. క‌ర్ణాట‌క బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత బ‌స‌న‌గౌడ మాట్లాడుతూ.. ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న ఉదార‌వాదులు.. మేధావుల‌ను ఆయ‌న దేశ‌ద్రోహులుగా పేర్కొన్నారు.

"మేధావులు ఈ దేశంలో ఉంటూ.. ప్ర‌జాధ‌నంతో అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అనుభ‌విస్తుంటారు. అయితే.. వారుభార‌త సైన్యానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటారు. మిగిలిన వారితో పోలిస్తే.. మ‌న మేధావులు.. లౌకిక‌వాదుల నుంచే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. నేను కానీ కేంద్ర హోంమంత్రిని అయితే ఇలాంటి వారిని కాల్చి చంపాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేస్తా" అని అన‌కూడ‌ని మాట‌ను ఆవేశంతో అనేశారు.

సైద్ధాంతికంగా విభేదాలు ఉండ‌టం ఎక్క‌డైనా స‌హ‌జం. మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని.. ఎవ‌రి అభిప్రాయాలు వారు చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింద‌న్న విష‌యాన్ని బ‌స‌నగౌడ్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. ఎవ‌రికి వారు వారికి న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌మ‌కు న‌చ్చ‌ని వారి కార‌ణంగా ముప్పు ఉంద‌ని కాల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసుకుంటూ పోతే ఏమై పోవాలి. ఇలాంటి తొంద‌ర‌పాటు వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్టం వాటిల్లేలా చేస్తాయ‌న్న విష‌యం బ‌స‌న గౌడ్‌ కు అర్థం కావ‌ట‌మే కాదు.. త్వ‌ర‌లోనే ఆయ‌న త‌న మాట‌ల్ని మీడియా త‌ప్పుగా రాసిందంటూ మీద ప‌డిపోవ‌టం ఖాయం. కాకుంటే.. కాస్త వెయిట్ చేయాలంతే.