Begin typing your search above and press return to search.

ఉద్యోగాల తొల‌గింపు..అంతా వ‌ట్టిదేన‌ట‌

By:  Tupaki Desk   |   18 May 2017 6:10 AM GMT
ఉద్యోగాల తొల‌గింపు..అంతా వ‌ట్టిదేన‌ట‌
X
కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ...ఒక్కోసారి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో సానుకూల వార్త‌లు తెలియ‌జెప్పాల్సింది పోయి స‌ద‌రు భ‌యాందోళ‌న‌ల‌ను మ‌రింత‌గా పెంచే రీతిలో కొంద‌రు ప్రచారం చేసేస్తుంటారు. తాజాగా ఐటీరంగం గురించి అదే జ‌రుగుతోంది. ఐటీ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో టెకీలు ఆందోళ‌న‌లో ఉంటే మ‌రో బాంబు లాంటి వార్త వినిపించింది. అదే.. ప్రముఖ ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఐబీఎం భారత్‌ లో దాదాపు 5000 ఉద్యోగాల్లో కొత పెట్టనుందంటూ వచ్చిన వార్త. అయితే ఉద్యోగుల తొల‌గింపు అంశాన్ని ఐబీఎం ఖండించింది.

ఐబీఎం ఇండియా అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుద‌ల చేస్తూ.. ``ఉద్యోగుల తొల‌గింపు దిశగా సంస్థ ముందుకు సాగుతోంద‌ని వెలువడిన రిపోర్టులు అవాస్తవమే. తప్పుడు రూమర్లు, ఊహాగానాలపై మేం స్పందించాలనుకోవడం లేదు`` అని టెక్‌ దిగ్గజం స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు - ఆటోమేషన్‌ ప్రభావంతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. విప్రో - ఇన్ఫోసిస్‌ లు కంపెనీలు కూడా ఉద్యోగాల కోతపై వార్నింగ్‌ ఇచ్చేశాయి. వీటి జాబితాలోనే ఐబీఎం కూడా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా...: 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ' (ఐటీ) రంగంలో కొలువుల కోతలకు అడ్డుకట్ట వేసేందుకు గాను పొరుగు సేవల సంస్థలు మన దేశంలోని అవకాశాలపై దృష్టి సారిస్తే మేలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ అభిప్రాయపడింది. ప్రపచంలోని ఇతర దేశాలలో రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతుండడం, యాంత్రీకరణల మూలంగా ఐటీ రంగంలో కొలువులకు కోత పడుతున్న తరుణంలో అసోచామ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఐటీ సంస్థలు కొంత దేశీయ మార్కెట్ల వైపు కూడా దృష్టి సారిస్తే మేలని పేర్కొంది. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కుదుటపడే వరకు సంస్థలు కొంత కాలం వరకు వ్యూహాలను పునర్‌ నిర్వచించుకోవడం మేలని తెలిపింది. ఇలా చేయడం మూలంగా లక్షల కొద్ది కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు వీలు పడుతుందని అసోచామ్‌ సెక్రెటరీ జనరల్‌ డి.ఎస్‌.రావత్‌ తెలిపారు. దీంతో ఐటీ రంగంలోని కొలువులకు కోతకు కొంత అడ్డుకట్ట పడుతుందని అన్నారు. దేశీయ మార్కెట్ల వైపు ఐటీ సంస్థలు దృష్టి సారించడం వల్ల అటు భారత్‌కు ఇటు ఐటీ పరిశ్రమ రెండింటికి మేలు జరగుతుందని అన్నారు. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనా, ఆధార్‌ ఆధారిత 'డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌' (డీబీటీ) సర్వీసుల డెలవరీల మూలంగా దేశీయంగా మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అసోచామ్ విశ్లేషించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/