Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఛానల్ లోటు తీరనుంది

By:  Tupaki Desk   |   12 Aug 2015 5:16 AM GMT
కాంగ్రెస్ కు ఛానల్ లోటు తీరనుంది
X
మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎవరి డబ్బా వారు వాయించుకోవటానికి.. తమ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయటానికి వీలుగా.. ఎవరి టీవీ గొట్టం వారు తయారు చేసుకోవటం తెలిసిందే. గతానికి భిన్నంగా రాజకీయ పార్టీల్లో ఎక్కువ భాగం మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవటం.. తమకు అనుకూలమైన వాదనల్ని.. ప్రత్యర్థుల తీరును ఎండగట్టటానికి టీవీ ఛానళ్లను ఏర్పాటు చేసుకోవటం.. న్యూస్ పేపర్లను పెట్టుకోవటం లాంటివి చేస్తున్నారు.

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లుగా దేశాన్ని అత్యధికాలం ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకే జాతీయ స్థాయిలో సొంత ఛానల్ అంటూ లేదు. తమ పరిస్థితికి మీడియాలో తమను సమర్థించే బలమైన గొంతు లేదని.. ఆ లోటు పూడ్చాలంటే ఛానల్ పెట్టుకోవాల్సిందేనన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొద్దికాలంగా వినిపిస్తున్నారు.

తాము చేసిన.. చేపట్టిన కార్యక్రమాల గురించి మీడియాలో ప్రముఖంగా కనిపించటం లేదని.. దీని వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నామన్న వేదనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక పరిష్కారం వెతికింది.

ప్రస్తుతం కేరళలో జైహింద్ అనే ఛానల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఛానల్ ను జాతీయస్థాయి ఛానల్ గా అప్ గ్రేడ్ చేస్తే.. కొత్త ఛానల్ ప్రారంభించే కష్టం తప్పటంతో పాటు.. వెనువెంటనే... తమ కార్యకలాపాల్ని వినిపించుకునే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ కేరళకు మాత్రమే పరిమితమైన జైహింద్ ఛానల్.. ఇక.. జాతీయ ఛానల్ కాంగ్రెస్ వాణిని సమర్థంగా వినిపిస్తుందన్న మాట.