Begin typing your search above and press return to search.

జిన్నా క‌ల‌లు క‌న్న పాక్ నా ఆశ‌యం..క‌శ్మీరే స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   27 July 2018 4:05 AM GMT
జిన్నా క‌ల‌లు క‌న్న పాక్ నా ఆశ‌యం..క‌శ్మీరే స‌మ‌స్య‌
X
పాకిస్థాన్‌ లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. 272 స్థానాలున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పాకిస్థాన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ నిలవడంతో ఆ పార్టీ అధినేత - కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ మీడియాతో మాట్లాడారు. జిన్నా కలలు కన్న పాకిస్థాన్‌ ను నిర్మిస్తాను అని ఇమ్రాన్‌ ఖాన్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ఆయన లేవనెత్తారు. క‌శ్మీర్‌ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ మరోసారి ఆరోపణలు గుప్పించారు. పౌర సమాజంలోకి ఆర్మీ ప్రవేశిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.

``ఇండియా - పాకిస్థాన్ కచ్చితంగా కశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇలా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వెళ్తే కుదరదు. ఇండియాతో సత్సంబంధాల కోసం మేం సిద్ధంగా ఉన్నాం. మీరు అడుగు ముందుకు వేయండి.. మేం కూడా రెండడుగులు వేస్తాం`` అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ``ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని నేను అనుకుంటున్నా. రెండు దేశాల మధ్య ప్రధానాంశం కశ్మీరే. క్రికెట్ కారణంగానే నేను ఇండియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాను. ఇండియన్ మీడియా నన్ను బాలీవుడ్ విలన్‌ లా చిత్రీకరించడం బాధ కలిగించింది అని ఇమ్రాన్ అన్నారు. 22 ఏళ్లు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నాను`` అని అన్నారు. .

కాగా, పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఫలితాలపై స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. ``నాకు చాలా సంతోషంగా ఉంది. ఇమ్రాన్‌ ఖాన్‌ కు కొన్ని సమస్యలు ఉన్నా.. ఆయన చాలా నిజాయతీపరుడు. మంచివాడు. ఏదో మంచి చేయలని అనుకుంటున్నారు అని ముషారఫ్ అన్నారు. ఇమ్రాన్ దూకుడుగా వ్యవహరిస్తారు. గతంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇండియాను సంతోషపెట్టడానికి చూసేవారు. ఇమ్రాన్ మాత్రం ఇండియా తీరును బట్టి స్పందిస్తారు`` అని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్ మాత్రం ఇండియా వ్యతిరేకి ఏమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు అని ముషారఫ్ చెప్పారు. ఇమ్రాన్‌కు ఇప్పటికీ పాలనపై అంతగా అవగాహన లేదని, మెల్లగా నేర్చుకుంటారని అన్నారు. రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవమని, పాకిస్థాన్‌ లో ఓడిన పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని ముషారఫ్ స్పష్టంచేశారు. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పీటీఐ.. ట్విటర్‌ లో చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతున్నది. ప్రధాని కార్యాలయం ఫొటోలను పోస్ట్ చేస్తూ.. త్వరలోనే ఓ వ్యక్తి ఇక్కడికి రాబోతున్నారు అని ట్వీట్ చేసింది.