Begin typing your search above and press return to search.

మరో వివాదంలో గవర్నర్ తమిళిసై

By:  Tupaki Desk   |   15 Oct 2022 10:32 AM GMT
మరో వివాదంలో గవర్నర్ తమిళిసై
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కోపంతో గవర్నర్ తమిళిసై ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.  గవర్నర్ అన్నాక రాజ్యాంగ బద్ద పదవి కానీ ఆమె బీజేపీకి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ బీజేపీ సమావేశంలో కనిపించిన తమిళిసై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ దండుకు అడ్డంగా దొరికిపోయారు.

తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. సీఎం కేసీఆర్ పై అనేకసార్లు తమిళిసై అసంతృప్తి గళం వినిపించారు.

తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని.. గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా కావాలని అవమానిస్తున్నారని మీడియా వేదికగా బహింరంగంగా ఆరోపించారు. తాను మహిళను అయినందుకే కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. తనకు ఇవ్వకపోయినా రాజ్ భవన్ కు గౌరవం ఇవ్వాలి కదా? అంటూ ప్రశ్నించారు.  కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరంటూ రాజకీయాల గురించి ఆమె మాట్లాడడంపై టీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు.

ఇక తమిళిసై కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలవడం.. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించడంతో ఆమె రాజకీయ నేతనా? అంటూ గులాబీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి అలాంటి వివాదంలోనే తమిళిసై చిక్కుకున్నారు. బీజేపీ నిర్వహించిన పొలిటికల్ మీటింగ్ లో తమిళిసై పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

'పోల్ స్ట్రాటజీ 2024 ఫర్ సౌత్ స్టేట్స్' పేరుతో ట్విట్టర్ స్పేసెస్ లో బీజేపీ నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నట్టు నెటిజన్లు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం ఏంటి? అంటూ ఆరోపిస్తున్నారు. గవర్నర్ గా కాకుండా బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఆమె బీజేపీకి ఫుల్ టైం పనిచేయాలని సూచిస్తున్నారు. గవర్నర్ పదవిలో ఉండి బీజేపీ ఏజెంట్ లా పనిచేయడం సరికాదంటున్నారు.

ఇక తమిళనాడులోని పార్టీలు కూడా గవర్నర్ తీరుపై మండిపడుతున్నాయి. గవర్నర్ గా సేవలు అందిస్తూ బీజేపీ ఎన్నికల వ్యూహ చర్చల్లో పాల్గొంటూ ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గవర్నర్ తమిళిసై తీరును వ్యతిరేకిస్తూ అనేక పార్టీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

గవర్నర్లు అన్నాక రాజ్యాంగబద్ద పదవిలో ఉండి సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలతో ఒకేలా ఉండాలి. కానీ తమిళిసై వ్యవహారశైలి మాత్రం వివాదాస్పదమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.