Begin typing your search above and press return to search.

ఎంపీలను మరీ ఇంత అవమానించాలా ?

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:27 AM GMT
ఎంపీలను మరీ ఇంత అవమానించాలా ?
X
ఢిల్లీలో తెలుగుదేశంపార్టీ ఎంపీలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా బాగా అవమానించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే తరపున పోటీచేస్తున్న జగదీప్ థనకర్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని చెప్పేందుకు టీడీపీ ఎంపీలు గట్టా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు అమిత్ ను కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి తమ పార్టీ మద్దతు ప్రకటించిన విషయాన్ని చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సమయంలో అమిత్ షా వ్యవహరించిన తీరే బావోలేదు. తన దగ్గరకు నలుగురు ఎంపీలు వస్తే కనీసం లేచి నిలబడి వారిని ఆహ్వానించాలన్న కనీస ఆలోచన కూడా లేకపోయింది. తనదగ్గరకు వచ్చిన నలుగురుఎంపీలకు హోంమంత్రి కూర్చునే నమస్కారం చేశారు.

ఎంపీలు కూడా హోంమంత్రితో నిలబడే మాట్లాడారు. తమకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎంపీల విషయంలో అమిత్ షా వ్యవహరించిన విధానంపై సోషల్ మీడియాలో బాగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మనింటికి ఏ పనిమీద ఎవరొచ్చినా లేచినిలబడి వారిని ఆహ్వానిస్తాం. పనికోసం వచ్చినా సరే వారిని నిలబడి ఆహ్వానించటం కనీస మర్యాద. ఇపుడు టీడీపీ ఎంపీల విషయంలో హోంమంత్రి కనీసమర్యాదను కూడా పాటించలేదని అర్ధమైపోతోంది. తమకు మద్దతు ప్రకటించిన పార్టీ ప్రతినిధులను అమిత్ షా రిసీవ్ చేసుకున్న విధానంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు.

హోంమంత్రి టీడీపీ ఎంపీలను అవమానించినట్లుగానే సోషల్ మీడియా పోస్టుల్లో అర్ధమవుతోంది. మీడియాలో కనబడిన ఫొటోను చూస్తే మాత్రం నెటిజన్లు ఇలాగే అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎంపీలను అమిత్ షా ఇంతగా అవమానించాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు.

రాష్ట్రప్రయోజనాలను నరేంద్రదమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు సరే కనీసం ఎంపీలకు మర్యాదలు కూడా చేయరా అంటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి దీనిపై అమిత్ సా ఎలా స్పందిస్తారో చూడాలి.