Begin typing your search above and press return to search.

జగన్ కు పెరుగుతున్న మద్దతు

By:  Tupaki Desk   |   9 Sep 2021 4:34 AM GMT
జగన్ కు పెరుగుతున్న మద్దతు
X
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జగన్ ప్రభుత్వం జారీ చేయగానే ప్రతిపక్షాలు ఎంతగా రాద్దాంతం చేస్తున్నాయో అందరూ చూస్తున్నదే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జగన్ ప్రభుత్వానికి మద్దతిచ్చేదిగా ఉంది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలో మాత్రమే చేసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చింది.

బహిరంగ ప్రాంతాల్లో వేదికలను ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించకూడదని, గుంపులుగా చేరి ఊరేగింపులు కూడా నిర్వహించేందుకు లేదని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రాంతాల్లో ఉత్సవాలను తర్వాత గుంపులుగా చేరి ఊరేగింపులను కూడా నిషేధించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గోవా, కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే. అయినా ఉత్సవాలను, ఊరేగింపులను నిషేధించాయి.

దేశంలో మరే రాష్ట్రంలో లేని ప్రత్యేకత ఏపీలో ఉంది. అదేమిటంటే ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంటాయి. ప్రభుత్వం వద్దంటే ప్రతిపక్షాలు కావాలంటాయి. ప్రభుత్వం కావాలంటే ప్రతిపక్షాలు వద్దంటాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రజా సంక్షేమం ఉందా లేదా అని ప్రతిపక్షాల ఏమాత్రం ఆలోచించటం లేదు. ఇపుడు తాజా వివాదంలో కూడా కేంద్రం జారీచేసిన ఆదేశాలనే జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అయినా సరే ప్రతిపక్షాలన్నీ కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి.

మొత్తం ఎపిసోడ్ లో ప్రతిపక్షాల్లో ఏవికూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే నరేంద్ర మోడీని కానీ తప్పు పట్టడం లేదు. బీజేపీ అంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతోంది. మరి చంద్రబాబునాయుడుకు ఏమైంది ? నేరుగా మోడీ పై ఆరోపణలు, విమర్శలు చేయచ్చు కదా. కానీ అలా చేయకుండా జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. పైగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఊరుకోకుండా జగన్ను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు తెగ అవస్థలు పడుతున్నారు.

సరే ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరో కోర్టులో కేసు వేశారు. దాంతో వెంటనే వినాయక చవితి ఉత్సవాలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మత పరమైన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదన్నది కోర్టు నిర్ణయం. ప్రైవేటు స్ధలాల్లో వేదికలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. ఒకేసారి ఐదుగురికి మించి పూజలు చేసుకోవద్దని చెప్పింది. మరి ఐదుమందికన్నా ఎక్కువ మంది చేరితే ఏమి చేయాలో కోర్టు క్లారిటి ఇవ్వలేదు.