Begin typing your search above and press return to search.

పారా ఒలంపిక్స్ లో భారత్ జోరు..

By:  Tupaki Desk   |   5 Sep 2021 12:30 PM GMT
పారా ఒలంపిక్స్ లో భారత్ జోరు..
X
మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు చాలా రోజుల తరువాత స్వర్ణ పతకం లభించింది. వందేళ్ల తరువాత అథ్లెట్ స్వర్ణం సాధించడం ఇండియాకు గొప్ప విషయంగా మారింది. అయితే అంతకు మించి అన్నట్లుగా పారా ఒలంపిక్స్ లో మనోళ్లు దూసుకెళ్లారు. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 5 బంగారు పతకాలను సాధించుకువచ్చారు. అంతేకాకుదు మొత్తం 19 పతకాలు గెలుచుకొని భారత జెండాను రెపరెపలాడించారు. ఇన్నేళ్లలో భారత్ ఇన్ని పతకాలను సాధించడం ఇదే మొదటిసారి. దీంతో పారా ఒలంపిక్స్ క్రీడా పట్టికలో ఎక్కడో ఉన్న భారత్ పేరు 24 స్థానంతో ముందుకు వచ్చింది.

సాధారణంగా ఒలంపిక్స్ క్రీడల్లో భారత్ ప్రతాపం అంతంత మాత్రంగానే అన్నట్లుగా వస్తోంది. గట్టిగా ఒకటి రెండు పతకాలు సాధించుకురావడమే గగనంగా మారేది. అయితే ఈసారి టోక్యో ఒలంపిక్స్ వెళ్లే ముందుకు మనోళ్లు 'ఈసారి సత్తా చూపిస్తాం..' అంటూ వెళ్లారు. సత్తా చూపించారు కానీ.. వారు అనుకున్న పతకాలు మాత్రం రాలేదు. అయినా నిరాశ చెందకుండా స్వర్ణ పతకం సాధించి ఇండియా పేరును నిలబెట్టారు. అటు రజతం, కాంస్యంలన్నీ కలిపి 7 పతకాలను పట్టుకొచ్చారు. అయితే మహిళల హాకీ చివరివరకు పోరాడి పతకం తేకున్నా వారి ప్రతిభకు దేశం మెచ్చుకుంది.

ఇక పారా ఒలంపిక్స్ క్రీడాకారులు అదే శపథం చేశారు. ఈసారి 15 పతకాలతో వస్తామని వెళ్లారు. అయితే పారా ఒలంపిక్స్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా వారు అనుకున్న పతకాల కంటే నాలుగు ఎక్కువగానే తీసుకొచ్చారు. అంతేకాదు ఎన్నడూ లేని విధంగా 5 బంగారు పతకాలను తీసుకొచ్చారు. మొట్టమొదటి సారిగా షూటర్ అవని లేఖరా భారత్ కు తొలి ఒలంపిక్స్ ను తీసుకొచ్చింది. ఆ తరువాత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ రెండో పసిడిని జమ చేశాడు. ఇక పోటీల ముగింపునకు ఒక్కరోజు ముందు భారత్ కు రెండు స్వర్ణాలు అందాయి. చివరకగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రమోద భగత్.. షూటర్ మనీష్ నర్వాల్ మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేశారు. చివరగా బ్యాడ్మింటన్లో కృష్ణానగర్ ఎస్ హెచ్ 4 విభాగంలో విజేతగా నిలిచి తిరుగులేని ముగింపు ఇచ్చాడు.

ఇలా మొత్తం 19 పతకాలు భారత్ కు దక్కాయి. ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలను భారత క్రీడాకారులు సాధించారు. మొత్తంగా పారా ఒలంపిక్స్ పట్టికలో ఎక్కడో ఉండాల్సిన భారత్ పేరును 24వ స్థానానికి తీసుకొచ్చారు. భారత్ సాధించిన క్రీడా చరిత్రలోనే ఇది అత్యుత్తమంగా పేర్కొంటున్నారు. ముందు ముందు ఇలాగే కొనసాగాలని క్రీడా నిపుణులు అభినందిస్తున్నారు.

ఇండియాలో క్రీడా రంగం మెరుగుపడుతుందనడానికి ఒలంపిక్స్ క్రీడల్లో భారత్ చూపిన ప్రతాపమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. క్రీడారంగంలో నైపుణ్యం పెరగడంతో పాటు సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించడంతోనే ఇది సాధ్యమవుతుందని కొందరు పేర్కొంటున్నారు. ఇక చాలా మంది క్రీడాకారులు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారున్నారు.. వివిధ రంగాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు.. అయితే క్రీడాసక్తి ఉన్నవారికి ప్రోత్సహిస్తే ఈ రంగంలో ఇంకా నైపుణ్యం వెలికితీయవచ్చని సలహాలు ఇస్తున్నారు.

మొన్నటి ఒలంపిక్స్ లో భారత్ సాధించిన పతకాలతో క్రీడాకారులను దేశం మొత్తం అభినందించింది. ఇప్పుడు ఊహించని విధంగా పారా ఒలంపిక్స్ లో ప్రతాపం చూపించారు. దీంతో రాను రాను ఇదే తరహాలో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలని పలువరు కోరుతున్నారు. ఇప్పటి వరకు భారత్ పారాల ఒలంపిక్స్ లో 12 పతకాలు మాత్రమే సాధించింది. ఈసారి ఏకంగా 19 పతకాలు అందులో 5 స్వర్ణాలు కొల్లగొట్టడం నిజంగా గర్వించదగ్గ విషయమే అంటున్నారు.