Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్.. మన అమ్మాయిలు అదుర్స్

By:  Tupaki Desk   |   1 Aug 2022 6:09 AM GMT
పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్.. మన అమ్మాయిలు అదుర్స్
X
గత ప్రపంచకప్ టోర్నీలో ఫస్ట్ టైం పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి ప్రధాన కారణంలో ఇదీ ఒకటి. పాక్ పై ఓడిపోవడాన్ని ఏ భారత అభిమాని సహించరు.

అయితే అలా జరిగిపోయింది. కానీ మన అమ్మాయిలు మాత్రం అదరగొట్టారు. పాకిస్తాన్ ను చావుదెబ్బ తీశారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్ ప్రీత్ జట్టు.. రెండోపోరులో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ లో పాకిస్తాన్ మహిళ జట్టుపై భారత్ విజయం సాధించింది. ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. ఉదయం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ ను 18 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అందరూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి పాక్ ను కట్టి పడేశారు. మునీబా అలీ మాత్రమే చెప్పుకోదగ్గర స్కోరు సాధించింది.

అనంతరం స్మృతి మందానా చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ కేవలం 11.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఓవర్ తొలి బంతిని సిక్సర్ గా మలిచిన స్మృతి అక్కడనుంచి వెనుదిరిగి చూడలేదు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ తో కలిసి తొలి వికెట్ కు 61 పరుగులు జోడించింది. అనంతరం స్మృతి చివరివరకూ ఉండి బౌండరీతో భారత్ కు విజయాన్ని అందించింది.

ఈ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అటు వరుసగా రెండో ఓటమితో పాక్ జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారత్ అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఆగస్టు 3న బార్బడోస్ జట్టుతో ఆడనుంది.

ఇక పాయింట్స్ టేబుల్ లో గ్రూప్ ఏలో భారత్ ఈ విజయంతో తొలి స్థానానికి చేరుకుంది. భారత్ 2 మ్యాచ్ లలో 1 గెలుపు, 1 ఓటమితో 2 పాయింట్లు సాధించడంతో పాటు నెట్ రన్ రేట్ +1.520 సాధించింది. ఇక బార్బడోస్, ఆస్ట్రేలియా తలా ఓ విజయంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సున్నా పాయింట్లతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.