Begin typing your search above and press return to search.

దాయాది దేశాల మ‌ధ్య ఇప్పుడేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   27 Feb 2019 4:35 PM IST
దాయాది దేశాల మ‌ధ్య ఇప్పుడేం జ‌రుగుతోంది?
X
పుల్వామా ఉగ్ర‌దాడి. యాభై వ‌ర‌కు భార‌తీయులు అమ‌రులు కావ‌టం. ఈ దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ వైమానిక శాఖ మెరుపుదాడులు. అనంత‌రం.. పాక్ యుద్ధ విమానాలు భార‌త్ లోకి ప్ర‌వేశించ‌టం.. వాటిని తిప్పి కొట్ట‌టం.. అదే స‌మ‌యంలో వాణిజ్య యుద్ధ విమానం ఒక‌టి కూలిపోవ‌టం.. మ‌రోవైపు భార‌త్ లోనూ.. అటు పాక్ లోని కొన్ని స‌రిహ‌ద్దు విమానాశ్ర‌యాల్ని మూసివేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇప్పుడు యుద్ధ వాతావ‌ర‌ణాన్ని సృష్టించేలా ఉంది.

రెండు దేశాల‌క ప్ర‌ధాన‌మంత్రులు అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కావ‌టం.. సుదీర్ఘంగా భేటీ కావ‌టం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుంద‌న్న ఉత్కంఠ పెరుగుతోంది. స‌రిహ‌ద్దు గ్రామాల్లోని ప్ర‌జ‌ల్ని వారి వారి ఇళ్ల‌ను ఖాళీ చేయాల‌ని భార‌త్ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌.. లేటెస్ట్ గా చోటు చేసుకున్న టాప్ 5 ప‌రిణామాలు చూస్తే..

1. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రాజ్‌ నాథ్‌ సింగ్ - భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ - ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) - రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. దేశ సరిహద్దులో భారీగా భద్రతా దళాలు మోహరించాలని ప్రధాని ఆదేశించారు. పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపులకు పాల్పడినా తిప్పికొట్టాలని ఆదేశించారు. దానికి ముందు మోడీ ఢిల్లీలో జ‌రిగిన నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ 2019 కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్క‌డ యువకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. భారత గగనతలంలోకి ప్రవేశించి పాక్‌ వైమానిక దళం జరిపిన దాడుల గురించి ప్రధాని కార్యాల‌య‌ అధికారులు ఓ పేపర్‌ మీద రాసి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకొని బ‌య‌లుదేరారు.

2. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా భారత్‌ లోని ఐదు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. శ్రీనగర్‌ - జమ్ము - లేహ్‌ - ఛండీగఢ్‌ - అమృత్‌ సర్‌ లో ఎయిర్‌ పోర్టులను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాజౌరి - పూంచ్‌ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

3. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలు.. రెండు భారత యుద్ధ విమానాలను నేల కూల్చినట్టుగా పాక్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమానాలను నేల కూల్చింది తామేనని పాక్ సైన్యం ప్రకటించింది. ఒక పైలట్‌ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది.

4. భారత వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్.. త‌న దేశ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంది. భార‌త్ కు ధీటుగా స‌మాధానం ఇస్తున్నామ‌న్న సినిమా చూపిస్తోంది. ఇండియ‌న్ వార్ ఫ్లైట్స్ ను నేల‌కూల్చిన‌ట్లుగా త‌ప్పుడు క‌థ‌నాల్ని వండి వారుస్తుంటే.. పాక్ మీడియా సైతం అదే నిజ‌మ‌ని న‌మ్మేలా వార్త‌ల్ని ప్ర‌సారం చేస్తోంది. తాజాగా భార‌త్ కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తూ.. దానికి సాక్ష్యంగా ఒక విమాన శ‌క‌లాన్ని చూపిస్తోంది. అయితే.. అది 2016లో జోధ్ పూర్ లోకూలిన మిగ్ - 21 విమాన శ‌క‌లం కావ‌టం గ‌మ‌నార్హం. పాత శ‌క‌లాన్ని కొత్త‌గా కూలిన‌ట్లు చూపిస్తున్న పాక్ తీరు చూస్తే వారి ప్ర‌చారం త‌ప్పుగా తేలుతోంది.

5. చైనాలో పర్యటిస్తున్న భారత‌ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దౌత్యం ఫలించింది. పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో చైనాతోపాటు రష్యా దేశాలు పాక్ కు వ్య‌తిరేకంగా గట్టి వార్నింగ్‌ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని పాక్ విడనాల్సిందేనని స్పష్టం చేస్తూ భారత్‌ - రష్యా - చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా ఖండిస్తున్నామని మూడు దేశాలు తేల్చిచెప్పాయి.

6. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ సైన్యానికి షాకిస్తూ పాక్ యుద్ధ విమానాలపై వైమానికి దళం ఎదురుదాడికి దిగింది. ఈ దాడుల్లో పాక్‌కు చెందిన ఎఫ్ - 16 యుద్ధ విమానం నేల కూలింది. లాంబ్ లోయలో నేలకూలినట్టు భారత వైమానిక దళం ధ్రువీకరించింది.