Begin typing your search above and press return to search.

భారత్ దౌత్యపోరు.. సుష్మ రంగంలోకి..

By:  Tupaki Desk   |   27 Feb 2019 9:47 AM GMT
భారత్ దౌత్యపోరు.. సుష్మ రంగంలోకి..
X
'జమ్మూలోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్ర శిబిరాలపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరాం. అలాగే ఐక్యరాజ్య సమితి సైతం ఈ దాడిని ఖండించింది. పొరుగు దేశాలు సైతం ఉగ్రదాడిపై చలించిపోయాయి. అయినా పాక్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తోంది' అంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ నిప్పులు చెరిగారు. భారత్-పాక్ యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత్ దౌత్యపోరుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా పొరుగున ఉన్న రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో సుష్మస్వరాజ్ ఈరోజు చైనా వెళ్లి సమావేశమయ్యారు.

పాక్‌ పై జరిగిన సెర్జికల్‌ స్ట్రైక్‌ పై ఆమె మాట్లాడుతూ ఉగ్రదాడిపై తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్‌ వ్యాఖ్యానించడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రవాద శిబిరం నడుపుతున్న జైషే మహ్మద్‌ ముఠాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి నిదర్శనం అన్నారు. జైషే మహ్మద్‌ ముఠాపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ కు అవకాశం ఇచ్చామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో భారత్‌ విమాన దాడులకు పాల్పడాల్సి వచ్చిందన్నారు.

దేశవ్యాప్తంగా మానవబాంబు దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉన్నందునే సెర్జికల్‌ స్ట్రైక్‌ చేయాల్సి వచ్చిందన్నారు. పాకిస్థాన్‌ పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర మూలాలను మాత్రమే మట్టుబెట్టామన్నారు. పాకిస్థాన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు అనుభవిస్తుందని అన్నారు.

ఇక చైనా, భారత్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రధాని మోడి అనధికారిక పర్యటన సాగినప్పటి నుంచి ఇరు దేశాలు ఒక్కటయ్యాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగుతుందని చెప్పారు. కాగా ఈ భేటి అనంతరం పాక్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని మద్దతివ్వమని చైనా తెలిపింది. భారత్ కు ఫుల్ సపోర్టుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. దీంతో దౌత్యపరంగా భారత్ భారీ విజయం సాధించినట్టైంది.