Begin typing your search above and press return to search.

అబుదాబిలో మనోడి సుడి తిరిగిపోయింది.. లాటరీతో జాక్ పాట్

By:  Tupaki Desk   |   4 March 2021 4:02 AM GMT
అబుదాబిలో మనోడి సుడి తిరిగిపోయింది.. లాటరీతో జాక్ పాట్
X
అదృష్టం ఉంటే ఇలానే ఉంటుంది మరి. ప్రతి నెలా తప్పనిసరిగా డబ్బులు పెట్టే లాటరీ టికెట్ కు తగలని జాక్ పాట్.. ఆఫర్ మీద కొన్న టికెట్ కు భారీ మొత్తం సొంతం చేసుకోవటం అంటే మాటలా? అబుదాబిలో భారతీయుడి కరవు తీరిపోయేలా.. ఒక్కసారిగా సెటిల్ అయిపోయేంతగా భారీ మొత్తం లాటరీతో లభించింది. ఈ ఏడాది మహా సుడిగాడు ఎవరంటే.. అతడి పేరే ముందు చెప్పాలేమో. నమ్మశక్యంగా అనిపించిన ఈ ఉదంతం అద్యంతం సినిమాటిక్ గా ఉందనే చెప్పాలి.

కర్ణాటకకు చెందిన శివమూర్తి కృష్ణప్ప 2005లో యూఏఈ వెళ్లాడు. అక్కడే ఒక సంస్థలో మెకానికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అతడికో అలవాటు ఉంది. లాటరీ టికెట్ కొంటే.. ఏదో రోజు తగులుతుందేమోనన్న చిన్నపాటి ఆశ ఉండేది. దీంతో.. కొన్నేళ్లుగా లాటరీ కొనేవాడు. ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. ఇలాంటివేళ.. తాజాగా కొన్న లాటరీ టికెట్ కు అనుకోని వరంలా జాక్ పాట్ తగిలింది.

దీంతో అతడి సొంతమైన మొత్తం ఎంతో తెలుసా? 12 మిలియన్ దిర్హమ్ లు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.23.85 కోట్లు. దీంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తాను కొన్న లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలిందంటే మొదట్లో నమ్మలేదట. మొదట్లో స్నేహితులతో కలిసి ఉమ్మడిగా లాటరీ టికెట్ కొనేవాడు. కానీ.. ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదట.

గత ఏడాది నుంచే తానే సొంతంగా లాటరీ టికెట్ కొనేవాడు. అయినా ఎప్పుడు ప్రైజ్ మనీ గెలుచుకున్నది లేదు. రెగ్యులర్ గా లాటరీ టికెట్ కొనేవాళ్ల కోసం రాయితీ మీద గత నెలలో రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. వాటిల్లో ఒకదానికి జాక్ పాట్ తగిలి.. భారీ మొత్తం సొంతమైంది. తనకు వచ్చిన భారీ మొత్తంతో తమ ఊళ్లో ఒక ఇల్లు కట్టుకుంటానని.. మిగిలిన మొత్తంలో అత్యధికం తన ఇద్దరు పిల్లల పేరుతో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తానని చెబుతున్నాడు. ఇతడి గురించి తెలిసిన వారంతా ఈ ఏడాది మహా సుడిగాడి టైటిల్ ఇతనికే ఇవ్వాలంటున్నారు.