Begin typing your search above and press return to search.

వీసాల‌పై టెన్ష‌న్ వ‌ద్దంటున్న కేంద్రం

By:  Tupaki Desk   |   30 April 2017 11:07 AM IST
వీసాల‌పై టెన్ష‌న్ వ‌ద్దంటున్న కేంద్రం
X
ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచంలోని వివిధ దేశాలు - ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయులు ఆందోళన చెందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి నిర్ణ‌యాల‌పై క‌ల‌క‌లం చెంద‌వద్దని క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మన దగ్గరే అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో కంటే నాణ్యతతో భారతపరిశ్రమ వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయ‌న ఆకాంక్షించారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సమావేశంలో క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా మాట్లాడుతూ ఈ మేర‌కు భ‌రోసా క‌ల్పించే మాటలు చెప్పారు. ఇటీవ‌ల అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకదాని తర్వాత ఒకటి వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయని, వీటి గురించి భారతీయులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన దగ్గర ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని సామాన్యుడికి సైతం ఉద్యోగావకాశాలు దక్కేలా కృషి చేయాలని పీకే సిన్హా సూచించారు. మనుషులను ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లకుండా అడ్డుకోగలుగుతున్నారే తప్ప, వస్తువుల రవాణాను నియంత్రించలేరని చెప్పారు. అందుకే మ‌నం వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌గాల‌ని పీకే సిన్హా తెలిపారు. వాటిని త‌ప్పనిస‌రి కొనుగోలు చేసే స్థాయికి చేర్చాల‌ని పీకే సిన్హా అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/