Begin typing your search above and press return to search.

పబ్ నిందితుల్ని పట్టించింది మీడియా అధినేత కొడుకా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 4:07 AM GMT
పబ్ నిందితుల్ని పట్టించింది మీడియా అధినేత కొడుకా?
X
సంచలనంగా మారిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతంలో నిందితుల్ని పోలీసులు ఎలా గుర్తించారు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. నిజానికి పార్టీకి హాజరైన వారిలో ఒకరికి మరొకరికి పరిచయం చాలా తక్కువ.

దీంతో.. ఒక గ్రూపునకు మరో గ్రూపునకు పెద్దగా పరిచయం లేని పరిస్థితి. దీంతో.. తనపై జరిగిన అత్యాచార ఉదంతం గురించి బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు.. తొలుత నిందితుల్ని గుర్తించటం కష్టమైందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక మీడియా సంస్థ అధినేత ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. బాధిత బాలికతో పబ్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్లిన వారికి తెలిసిన వారు ఎవరన్న ఆరా తీసినప్పుడు మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఒక మీడియా సంస్థ కార్యాలయానికి పోలీసులు వెళ్లటం.. దాని అధినేత కుమారుడ్ని కలిసి ఆరా తీయగా.. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. తాము చేసిన పాడు పని గురించి నిందితులు తనతో చెప్పారని.. తనను సాయం కోరగా.. తాను అంగీకరించలేదని పోలీసులకు అతగాడు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. సదరు మీడియా అధినేత కుమారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. గ్యాంగ్ రేప్ దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురు నిందితులు మైనర్లు కాగా.. మరో ఇద్దరు మేజన్లుగా చెబుతున్నారు.

వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మసీవుల్లా ఖాన్ కొడుకు.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్.. బంజారాహిల్స్ కు చెందిన ఉమేర్ ఖాన్ లతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

వీరే కాదు.. సంగారెడ్డికి చెందిన ఒక కార్పొరేటర్ కొడుకు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా.. మరొకరిని పోలీసుల నిఘాలో ఉంచినట్లుగా చెబుతున్నారు. మిగిలిన వారిని గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది.