Begin typing your search above and press return to search.

నిమిషాల్లోనే 40 వేల కోట్ల ఇన్ఫోసిస్ నష్టం

By:  Tupaki Desk   |   18 April 2022 8:34 AM GMT
నిమిషాల్లోనే 40 వేల కోట్ల ఇన్ఫోసిస్ నష్టం
X
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్'కు గట్టి దెబ్బ పడింది.2022 ఆర్థిక సంవత్సరానికి చెందిన నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం.. మార్టిన్ అంచనాలను బ్రోకరేజ్ సంస్థలు తగ్గించడంతో సోమవారం స్టాక్ మార్కెట్లో షేరు కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏకంగా 9శాతానికి పైగా షేర్ పడిపోయింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇన్ఫోసిస్ పెట్టుబడుదారులు రూ.40వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు.

బీఎస్.ఈలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,92,281 కోట్లుగా నమోదైంది. ఇన్ఫోసిస్ దెబ్బకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సుమారు 4శాతం మేర పతనమైంది. ఇన్ఫోసిస్ రెండేళ్లలో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ఇన్ఫీ షేరు రూ.1592 వద్ద కనిష్ట స్థాయిలను టచ్ చేసింది.

ఇన్ఫోసిస్, హెచ్.డీఎఫ్.సిలు భారీగా కుప్పకూలుతుండడంతో మార్కెట్లు కూడా దారుణమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా నష్టపోతుంది.

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ 'ఇన్ఫోసిస్'. ఈ మార్చితో ముగిసిన క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభం 12శాతమే పెరిగి రూ.5686 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈ లాభం గతేడాది ఇదే క్వార్టర్ లో రూ.5076 కోట్లుగా ఉంది. రెవెన్యూలు సుమారు 23శాతం పెరిగి రూ.32276 కోట్లుగా ఉన్నాయి. అయితే మార్చిలో క్వార్టర్ లో కంపెనీ మార్జిన్ పర్ ఫార్మెన్స్ అంతా బాగోలేకపోవడం ఈ నష్టాలకు కారణమైంది.

ఇన్ఫోసిస్ ను ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైన తర్వాత రష్యాలో ఈ సంస్థ కార్యకలాపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రష్యాలోని ఇన్ఫోసిస్ వ్యాపారాలపై బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. రిషి సనక్ భార్య, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తికి ఈ కంపెనీలో షేర్లు ఉన్నాయి.

ఈ వివాదాల నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ తన వ్యాపారాలను మూసివేసినట్టు కూడా ప్రకటనలు వచ్చాయి. అయినప్పటికీ ఇన్ఫీని చుట్టుముట్టిన ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.