Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో విశాఖ‌లో ఇనార్భిట్ మాల్!

By:  Tupaki Desk   |   8 July 2022 9:59 AM GMT
త్వ‌ర‌లో విశాఖ‌లో ఇనార్భిట్ మాల్!
X
రహేజా గ్రూప్ తన కొత్త స్టోర్ ఇనార్బిట్ మాల్ ను విశాఖపట్నం ఓడరేవులో తెర‌వ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విశాఖపట్నం పోర్టుకు చెందిన 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్‌ను నిర్మించనున్నార‌ని తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న మెట్రో న‌గ‌రాల్లో ఇనార్బిట్ మాల్స్ మంచి పేరు పొందాయి. ఓవైపు సినిమా స్క్రీన్లు, మ‌రోవైపు రెస్టారెంట్లు, షాపింగ్ దుకాణాలు ఇలా ఎన్నో ర‌కాల దేశీ, విదేశీ బ్రాండ్ల‌కు ఇనార్భిట్ మాల్స్ ఒకే చోట వేదిక‌గా నిలుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటికి ప్ర‌జ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్ద న‌గ‌రంగా విశాలో ఇనార్భిట్ మాల్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. విశాఖ‌లో ఓడ‌రేవు, తూర్పు నౌకాద‌ళం ప్ర‌ధాన కేంద్రం, కోర‌మండ‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడె, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేష‌న్, విశాఖ స్టీల్.. ఇలా ఎన్నో కంపెనీలు ఉన్నాయి.

వీటిలో నార్త్ ఇండియ‌న్స్ తోపాటు తెలుగువారు పెద్ద సంఖ్య‌లో ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విశాఖ‌లో ఇనార్భిట్ మాల్ ను ఏర్పాటు చేయాల‌ని ర‌హేజా గ్రూప్ నిర్ణ‌యించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇదే మొద‌టి ఇనార్బిట్ మాల్ కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలోని సైబరాబాద్ లో దీనికి స్టోర్ ఉంది. ఈ మేర‌కు రహేజా గ్రూప్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని మాల్‌ను ఏర్పాటు చేస్తోంది. 17 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు తీసుకునేందుకు పోర్ట్ ట్రస్టుకు ఇప్ప‌టికే రూ.125 కోట్లు చెల్లించింద‌ని స‌మాచారం. లీజు గడువు ముగిసిన తర్వాత సంస్థ నిర్మాణాలతో స్థలాన్ని వదిలివేయాల్సి ఉంటుంది.

అయితే, సంస్థ అదే స్థలంలో కొనసాగాలనుకుంటే, సంస్థ భూమి ధర, నిర్మాణాల ధరను లీజుకు తీసుకుని చెల్లించాల్సి ఉంటుంది. పోర్ట్ ట్రస్ట్ ఆక్రమణలను నివారించడానికి, ఖాళీ భూముల నుండి కొంత ఆదాయాన్ని సంపాదించడానికి దాని భూములను పోర్టు లీజుకు ఇవ్వడం ప్రారంభించింది.

పోర్టు ట్రస్ట్‌ భూముల్లోనే మాల్‌ను ఏర్పాటు చేస్తోంద‌ని పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కె రామమోహన్‌రావు విశాఖపట్నంలో మీడియాతో తెలిపారు. సాలిగ్రామ పురం గ్రామంలో ట్రస్ట్ 17 ఎకరాల భూమిని మాల్ కోసం రహేజా గ్రూప్‌కు లీజుకు తీసుకుందని చెప్పారు.