Begin typing your search above and press return to search.

2024 వరకూ కరోనా ఉంటుంది అంట?

By:  Tupaki Desk   |   18 Dec 2021 2:21 PM IST
2024 వరకూ కరోనా ఉంటుంది అంట?
X
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. కొత్తరకం ఒమిక్రాన్ ఇప్పుడు యూరప్ ఖండాన్ని భయపెడుతోంది. అక్కడ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో రోజుకు 60వేలకు పైగా కేసులు నమోదై వైద్యరంగం కుదేలవుతోంది. కొత్తగా రూపం మార్చుకుంటున్న విరుచుకుపడుతున్న ఈ వైరస్ కు ఎటువంటి చికిత్సా ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు.

ఈ క్రమంలోనే ప్రపంచ ఫార్మా దిగ్గజ సంస్థ ‘ఫైజర్’ సంచలన ప్రకటన చేసింది. 2024వరకూ ఈ కరోనా తీవ్రత ఇలాగే ఉంటుందని బాంబు పేల్చింది. ఈ మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలేదని లేదని స్పష్టం చేసింది.ఫైజర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైఖేల్ డోల్ సన్ ఈ మేరకు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. కరోనా నుంచి చిన్న పిల్లలను కాపాడేందుకు 2 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు 3 డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ మూడు డోసుల వ్యాక్సినేషన్ తో కరోనా నుంచి మెరుగైన రక్షణ కలుగుతుందని.. ప్రాణాపాయం తప్పుతుందని వెల్లడించారు.

అయితే పెద్దవారిని మాత్రం మూడు డోసులు వేసుకున్నా కరోనా వదిలిపెట్టడం లేదు. ఈనెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని.. అయినా అతడికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అతడికి ఒమిక్రాన్ వైరస్ అని తేలిందని చెప్పారు. అయితే అతడిలో ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఒమిక్రాన్ మూడు డోసులు వేసుకున్నా కూడా వస్తుందని అర్థమవుతోంది.

కరోనా మహమ్మారిని మళ్లీ సోకకుండా టీకాలు నిలువరించలేవని ఇదివరకే నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ విషయంలోనూ నిజమైంది. టీకా వేసుకున్నా రీఇన్ఫెక్షన్ అవుతాయని.. అయితే దాని తీవ్రత స్వల్పంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

దీన్ని బట్టి ఒమిక్రాన్ వైరస్ తీవ్రత ఎక్కువని.. అది ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టదని అర్థమవుతోంది. ఫైజర్ సైంటిస్ట్ చెప్పినట్టు ఈ వైరస్ 2024 వరకూ మనతోనే ఉండేలా కనిపిస్తోంది. మరో మూడేళ్లు ఈ మహమ్మారిని ప్రపంచం భరించకతప్పదని తెలుస్తోంది.