Begin typing your search above and press return to search.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..గంట ఆగితే ప్రాణాలు దక్కేవి

By:  Tupaki Desk   |   22 Jun 2020 4:40 PM IST
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..గంట ఆగితే ప్రాణాలు దక్కేవి
X
ఇంటర్‌ ఫస్టియర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. కానీ, ఒక గంట గడిస్తే ఆ అమ్మాయి ప్రాణాలు దక్కేవి. ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి అందులో ఫెయిల్ అయిన అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియకుండానే ఆ అమ్మాయి చనిపోయింది.

స్థానిక ధనియాలపేటకు చెందిన విద్యార్థిని ఇంటర్‌ ఫస్టియర్‌ లో ఉత్తీర్ణత సాధించలేదు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థానికి గురైంది. శనివారం ఇంట్లోనే ఎలుకల మందు తినేసింది. దీనితో వెంటనే గమనించిన తల్లి ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఆదివారం చనిపోయింది. దీంతో బాలిక కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన గంట సమయం తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి అందులో ఫెయిల్ అయిన అందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసిన ప్రకటనకు, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయానికి మధ్య కేవలం గంట వ్యవధి మాత్రమే ఉందట. ఒక గంటపాటు ఆగితే ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులతో పాటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.