Begin typing your search above and press return to search.

ఐపీఎల్ అంటే.. గాయాలు మాయమైనట్టేనా? ఫిట్ నెస్ వచ్చేస్తుందా?

By:  Tupaki Desk   |   24 March 2022 1:30 AM GMT
ఐపీఎల్ అంటే.. గాయాలు మాయమైనట్టేనా? ఫిట్ నెస్ వచ్చేస్తుందా?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత సంచలనమో, అదే స్థాయిలో చర్చనీయాంశమైంది కూడా. తొలి సీజన్ లోనే అంతర్జాతీయ కేలండర్ లో చేర్చాలనే డిమాండ్లు.. వాటికి తిరస్కరణలు.. అనంతరం ఆటగాళ్లు తమ క్రికెట్ బోర్డులను ధిక్కరించి ఐపీఎల్ లో ఆడేందుకు మొగ్గుచూపడం, కొందరైతే ఏకంగా అంతర్జాతీయ కెరీర్ కే గుడ్ బై కొట్టడం.. ఒకటేమిటి..? ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది.

స్పాట్ ఫిక్సింగ్ సహా మరెన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పడు టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మరో సంచలన వ్యాఖ్య చేశాడు. "ఐపీఎల్ అనగానే ఫిట్‌గా మారిపోతారు" సెటైర్ వేశారు. నాలుగైదు నెలల కిందట టీమిండియా హెడ్ కోచ్ గా తప్పుకొన్న రవి శాస్త్రి ఈ ఏడాది ఐపీఎల్ లో కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్నాడు. అతడితో పాటు రైనా కూడా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు.

దేశం గొప్పా..? లీగ్ గొప్పా..?
ఐపీఎల్ అనగానే విదేశీ మీడియాకు కొంత మంట పుడుతుంది. కానీ, వారి ఆటగాళ్లకు మాత్రం మన లీగ్ మహా ముద్దు. అందుకనే.. దేశ క్రికెట్‌ బోర్డు కన్నా క్లబ్‌ క్రికెట్టే గొప్పదా? జాతీయ జట్టు బాధ్యతలు కన్నా.. డబ్బు ముఖ్యమైందా..? ఐపీఎల్ కోసం గాయపడ్డ ఆటగాళ్లు కూడా ఒక్కసారిగా ఫిట్ గా మారిపోతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇదే నేపథ్యంలో గాయ‌ప‌డిన ఆట‌గాళ్లంతా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఐపీఎల్ వేలానికి ముందు ఫిట్‌గా మారిపోతార‌ని రవిశాస్త్రి కామెంట్లు చేశాడు.

దీనిని బ‌ట్టి ఆట‌గాళ్ల‌కు ఐపీఎల్ ఓ గొప్ప ఫిజియోథెర‌పిస్ట్‌లా ప‌ని చేస్తుంద‌ని ఎద్దేవా చేశాడు. ఇది త‌న ఒక్కడి అభిప్రాయం మాత్ర‌మే కాద‌ని, చాలా మంది క్రికెట్ వ‌ర్గాల్లో కూడా ఇదే భావన ఉంద‌ని చెప్పాడు. సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం ఇదే అనుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్లు డ‌బ్బుల గురించి మర్చిపోయి ఆట‌పై దృష్టి పెట్టాల‌ని సూచించాడు.

యువ ఆటగాళ్లూ.. కెప్టెన్సీకి సిద్ధం కండి..
టీమిండియాకు భ‌విష్య‌త్‌లో కెప్టెన్ కావాలని భావిస్తున్న యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ర‌విశాస్త్రి అన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్లుగా ఉన్న‌ రిష‌బ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు భ‌విష్య‌త్ కెప్టెన్ల‌ను అన్వేషించ‌డ‌మే ఈ ఐపీఎల్ ప్ర‌త్యేక‌త అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శ‌ర్మ టీమిండియాను అద్భుతంగా న‌డిపిస్తున్నాడ‌ని కొనియాడాడు.

అతడి సారథ్యంలోని భారత్ దుమ్మురేపుతోందని.. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ ఉందని.. ఇలాగే ఆడాలని సూచించాడు రవిశాస్త్రి. ఐపీఎల్‌కు ముందు వ‌ర‌కు వెంక‌టేశ్ అయ్య‌ర్ గురించి ఎవ‌రికీ తెలియ‌ద‌ని, కానీ ప్ర‌స్తుతం జాతీయ జ‌ట్టులో ఆడుతున్నాడ‌ని, ఇదే ఐపీఎల్ ప్ర‌త్యేక‌త అని ఆయ‌న చెప్పాడు. ఐపీఎల్ వ‌ల్ల కొత్త ఆట‌గాళ్ల‌ను క‌నిపెట్ట‌డం సులభ‌మైంద‌ని అన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా? లేదా? అని ఈ ఐపీఎల్‌లో అత‌డిని దేశ‌మంతా గ‌మనిస్తుంద‌ని ర‌వి శాస్త్రి చెప్పాడు.