Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   17 Nov 2022 7:58 AM GMT
చంద్రబాబు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా...?
X
ఓటర్లు అంటే ప్రజాస్వామ్యంలో వారు అసలైన ప్రభువులు. నాయకులు అంటే సేవకులు. తమకు ఎవరు బాగా పనిచేసి పెడతారు అన్నది ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్చ హక్కు అన్నీ ఓటర్లకు ఉంటాయి. తమను మాత్రమే పర్మనెంట్ పనివారిగా చేసుకోవాలని డిమాండ్ చేసే అధికారం ఏ సేవకుడికీ లేదు. అలాగే తాము మాత్రమే మంచి పనిమంతులమని చెప్పుకుని తమను ఎన్నుకోకపోతే ప్రళయాలు వస్తాయని బెదిరించే ధోరణి కూడా అసలు పనికిరాదు.

ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఇది ప్రజాస్వామ్యం. ప్రభువు స్థానంలో ప్రజలు ఉన్నారు వారికి అన్నీ తెలుసు. ఎవరికి ఎపుడు తమ సేవకులుగా చేసుకోవాలో తెలుసు. అయితే సేవకుడిగా తమను ఎంపిక చేసుకోవాలనుకునే వారు తమ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తాము ఎంతో సేవ చేస్తామని కూడా చెప్పుకోవచ్చు. ఆ పైన ప్రభువుల దయ, సేవకుడిగా ఎంపిక చేసే విషయంలో ప్రభువుదే తుది నిర్ణయం.

అయితే ఎక్కడ అయినా సేవకుడు ఏ పరిస్థితులలోనూ యజమానిని బెదిరించలేడు. నేను తప్ప నీకు వేరే గతి లేదని కూడా గట్టిగా మాట్లాడలేదు. ఆ విధంగా చేయడం ద్వారా సేవకుడు గుణగణాలు మరింతగా చెడతాయి తప్ప లాభం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో త్రసు అటు నుంచి ఇటు తిరిగిపోయి ప్రభువుల స్థానంలో సేవకులు కూర్చుంటున్నారు. సేవకులుగా బిచ్చగాళ్ళుగా ప్రభువులను మార్చేస్తున్నారు. అంతా ఉల్టా సీదాగా చేస్తున్నారు.

దాంతోనే వస్తోంది అసలైన ఇబ్బంది. అదే ప్రజస్వామ్యానికి చేటు తెస్తోంది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అని ముతక సామెత ఉంది. అలాగే సేవకుడు ముదిరిపోతే యజమానికే ఎసరు పెడతాడు అని కూడా కొత్త సామెతగా చెప్పుకోవాలి. ఇపుడు అలా సేవకులు ఎంత దూరం వెళ్తున్నారు అంటే నన్నే ఎన్నుకోవాలి లేకపోతేనా అంటూ చాలా చెబుతున్నారు. అలాంటి ఒక ఘనత వహించిన సేవకుడు. ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కర్నూల్ జిల్లాలోని పత్తికొండ రోడ్ లో షోలో చంద్రబాబు మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి తెర తీశారు.

ఈ ఎన్నికల్లో ప్రజలను తనను గెలిపించకపోతే లాస్ట్ ఎన్నికగా ఇవి మారి తాను అసెంబ్లీకి దూరం అవుతాను అని సెంటిమెంట్ బాణాలు సంధించారు. నిజానికి చంద్రబాబు వంటి సీనియర్ ఈ విధంగా మాట్లాడం మీద రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికలు అంటే ఒక యుద్ధం. దాన్ని అలాగే భీకరంగా గంభీరంగా ఎదుర్కోవాలి. దాని కోసం ఎదురొడ్డి పోరాడాలి. విజయుడిగా గెలుచుకోవాలి. జనం మనసులను తన పనితనంలో ఆకట్టుకోవాలి.

అంతే తప్ప ఎదుటివారి లోని లోపాలనో లేక తనలోని బలహీనతలనో బయట వేసుకుని జనాల ముందుకు వచ్చి సానుభూతిని కురిపించమని కోరడం అంటే అసలు విషయం పక్క దోవ పట్టేస్తున్నాట్లే. ఆ అవసరం చంద్రబాబుకు ఉందా అన్నదే ఇపుడు చర్చ. చంద్రబాబు అంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఆయన రాజకీయ చతురుడు అని అంతా అంగీకరిస్తారు. ఇక బాబు పర్మనెంట్ డైలాగ్ ఒకటి ఉంది. అదేంటి అంటే తాను సంక్షోభాలను సైతం సోఫానాలుగా మార్చూంటాను, గెలుస్తాను అని చెప్పడం. నిజంగా బాబు అలాతే ఇంతదాకా చేసేవారు.

మరి అలాంటి బాబు ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నదే చర్చ. ప్రజలకు ఎవరికి ఎన్నుకోవాలో బాగా తెలుసు. తన మెరిట్స్ అన్నీ జనం ముందు పెట్టి అవతల వారి పాలనలో తప్పులను బయటపెడితే తూకం వేసి బాబుకు కుర్చీ అప్పగించవచ్చేమో. అలా కాకుండా తాను ఒక శపధం పట్టి వచ్చాను కాబట్టి తనకు ఏజ్ బార్ అవుతోంది కాబట్టి తనకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి గెలిపించాలని కోరడం ఒక విధంగా రాజకీయ దివాళాకోరు తనమే అవుతుంది అని అంటున్నారు.

ఇక చంద్రబాబుకు ఎపుడూ సానుభూతి అచ్చిరాదు అనే అంటారు. ఆయన్ని ఎన్నుకున్న వారు కూడా ఆయన అమాయకుడని, లేక ముక్కుసూటి మనిషి అని ఎన్నుకోవడంలేదు. ఆయన ఎన్ని రకాలు వ్యూహాలు వేసినా ఆయనలో ఒక విజనరీ ఉన్నాడని అభివృద్ధి చేస్తారని నమ్మి దాన్ని చూసి ఓట్లేస్తారు. అంతే తప్ప బాబు ఏజ్ చూసో లేక ఆయన చెబుతున్నట్లుగా ఎన్నో ఎన్నిక ఆయనకు అది అవుతుందో చూసి ఓటేయరు. ఇది కన్ ఫర్మ్. అయితే చంద్రబాబు మాత్రం ఈ రకమైన ఎత్తుగడకు తెర తీశారు. అది కూడా వైసీపీకి హార్ కోర్ రీజియన్ గా పేరుపొందిన రాయలసీమలో. దీన్ని ప్రత్యర్ధిలు బ్లాక్ మెయిల్ రాజకీయం అంటున్నారు. మరి జనాలు బాబు చేస్తున్న ఈ రకమైన రాజకీయానికి పడిపోతారా ఏమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.