Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పదా?

By:  Tupaki Desk   |   1 Jan 2022 10:30 AM GMT
మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పదా?
X
దేశాన్ని కరోనా కొత్త వైరస్ ‘ఒమిక్రాన్’ కమ్మేస్తోంది. క్షేత్రస్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద అత్యధికంగా మహారాష్ట్రలో 8వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో ఒక్క ముంబైలోనే 5300 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మహారాష్ట్రనే బాగా ఎఫెక్ట్ అవుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా దారావి ముంబైలోనే ఉండడమే కేసుల పెరుగుదలకు కారణాలనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ముంబైలోని ఆస్పత్రులన్నీ మళ్లీ కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడం.. అదే సమయంలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా పెరుగుతుండడం వల్లే ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

దేశం మొత్తం మీద 24 గంటల్లో 1300 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో మాత్రం 500 కేసులుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా, సిలిండర్ల సంఖ్యను ప్రభుత్వం తాజాగా పెంచుతోంది. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత కారణంగా జరిగిన అనర్థాలు అందరికీ తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా పెరిగిపోతున్నా కేసుల సంఖ్యను తట్టుకోవడం ప్రభుత్వానికి కష్టంగా తయారైంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత ఎక్కడైతే నమోదవుతోందో అక్కడే కరోనా వైరస్ కేసులు కూడా పెరిగిపోతుండడమే ఆశ్చర్యంగా ఉంది.

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతటి అనర్థాన్ని తెచ్చాయో రాబోయే కేసులు సంఖ్య తెలిస్తే కానీ పరిస్థితి తీవ్రత ఎంతో అంచనావేయలేం. అయితే జనాలు మాత్రం లెక్కచేయకుండా సంబరాల్లో మునిగిపోతున్నారు.