Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి.. రోహిత్ రెడ్డి.. ఏపీ పరువు తీస్తున్నారు..

By:  Tupaki Desk   |   4 Jan 2023 9:29 AM GMT
మల్లారెడ్డి.. రోహిత్ రెడ్డి..  ఏపీ పరువు తీస్తున్నారు..
X
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల అంధ్రాకు అధ్యక్షుడిని ప్రకటించారు. అంతేకాకుండా సంక్రాంతి తరువాత ఆంధ్రాలో బీఆర్ఎస్ కార్యాలయం తెరుస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధే ఏపీలో చేస్తామన్నారు. అయితే కేసీఆర్ ఆంధ్రాలో బీఆర్ఎస్ ను పటిష్టం చేయాలనుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు కేసీఆర్ వచ్చి చేస్తారని అంటున్నారు. ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా మల్లారెడ్డి, రోహిత్ రెడ్డిలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తిరుపతి వెంకన్న దర్శనం కోసం వచ్చిన మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. ఇక్కడి ప్రజల కల పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేస్తారని తెలిపారు. తాండూరుకు చెందిన మరో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం ఆంధ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా రాజకీయాల్లో మార్పుల రావాల్సిన అవసరం ఉందని, అది కేసీఆర్ తోనే సాధ్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకనే అభివృద్ధి జరగలేదని అన్నారు.

అంతేకాకుండా అంతకుముందు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. దొంగ కరెంట్ తీసుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పై చర్చ మొదలైందని, తెలంగాణలో అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని అన్నారు. ఇక ఏపీ అభివృద్ధిని తెలంగాణ అడ్డుకుంటుందన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు.

ఓ వైపు కేసీఆర్ ఆంధ్రా నాయకులు తనతో కలిసి వస్తున్నారని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇంతకాలం ఏపీలో అభివృద్ధి జరగలేదని అనడం అక్కడి నాయకుల్లో చర్చ ప్రారంభమైంది. తెలంగాణలో పైపైన మెరుపులు చేస్తూ కేసీఆర్ మోసం చేస్తున్నానని వైసీపికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. విభజన నిబంధనలు పాటించకుండా కేసీఆర్ ఆంధ్రాకు అన్యాయం చేశారన్నారు.

అయితే ఈ విమర్శలు వ్యూహంలోనే భాగమేనని తెలుస్తోంది. పార్టీ అధినేతకు తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు ఎవరిపై విమర్శలు చేసే అవకాశం లేదు. కానీ మల్లారెడ్డి, రోహిత్ రెడ్డిలు మాత్రం నేరుగా అధికార పార్టీపై బాణాలు ఎక్కుపెడుతున్నారు.

ఒక పార్టీకి ప్రచారం చేయాలంటే ఆ పార్టీని ఎదుటి వారు విమర్శించేలా చేయాలి. అప్పుడు దాని గురించి ప్రజలకు తెలుస్తోంది. ఆంధ్రాలో ఉన్న పార్టీలను పక్కనబెట్టి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన బీఆర్ఎస్ ను ఏకంగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రజలను బీఆర్ఎస్ లేదా వైసీపీ వైపు మరల్చడానికి నాయకులు చేసిన వ్యూహమేనా..? అని అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.