Begin typing your search above and press return to search.

మోడీ ముందు సోము అభాసుపాలయ్యారా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:33 AM GMT
మోడీ ముందు సోము అభాసుపాలయ్యారా?
X
బీజేపీ కార్వనిర్వాహక వర్గం సభ్యుడిగా, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) తో సన్నిహిత సంబంధాలతో బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవిని దక్కించుకున్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసి దూకుడైన రాజకీయాలు చేస్తారని ఆశించినా బీజేపీ శ్రేణులకు నిరాశే ఎదురయిందని అంటున్నారు.

తాజాగా ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని.. ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీని నిర్మిస్తూ రావాలన్నారు. తాము గుజరాత్‌లో ఇలా చేయబట్టే అక్కడ దాదాపు 25 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. సోము వీర్రాజును ఏపీలో ఎన్ని జిల్లాలు, మండలాలు ఉన్నాయని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేక తెల్ల మొహం వేశారని ప్రచారం జరుగుతోంది. మండలాలు, జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని ప్రధాని సూచిస్తూ పనిలో పనిగా ఎన్ని జిల్లాలు, మండలాలు ఉన్నాయని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే దీనికి సోము వీర్రాజు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని అంటున్నారు.

దీంతో సోముతోపాటు వచ్చిన బీజేపీ నేతలు ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలు, 668 మండలాలు, 26 జిల్లాలు, 130కి పైగా మున్సిపాలిటీలు ఉన్నాయని లెక్కచెప్పినట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. సోము వీర్రాజును మరో ప్రశ్న అడగలేదని అంటున్నారు. సోము వీర్రాజుకు ఏపీ రాజకీయాలపై ఎంత పరిజ్ఞానం ఉందో ఈ ఒక్క విషయంతోనే ప్రధానికి కూడా తెలిసిపోయిందని స్పష్టం చేస్తున్నారు.

బీజేపీ అధిష్టానంతో, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులతో సన్నిహిత సంబంధాలతోనే సోము వీర్రాజుకు బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి వచ్చిందని చెప్పుకునేవారే ఎక్కువ. ఆయన అధ్యక్ష స్థాయికి తగిన వ్యక్తి కాదని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి.

ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాదరణ, పాపులారిటీ, వాగ్దాటి, అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం, వ్యూహ చతురత వంటివి ఉండాలని.. ఇవేమీ సోము వీర్రాజులో లేవని చెబుతున్నారు. అందులోనూ కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీకి సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటిది ఆయనను తాజాగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విశాఖలో పార్టీ జెండాలు పెట్టించే క్రమంలో జీవీఎంసీ సిబ్బంది కూడా లెక్కచేయలేదని అంటున్నారు.

పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి వైసీపీకి సన్నిహితంగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పదే పదే టీడీపీని లక్ష్యంగా చేసుకునే ఆయన విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.

అసలు జనసేన-బీజేపీ మైత్రి ముందుకు వెళ్లకపోవడానికి కారణం కూడా సోము వీర్రాజు అనే వాదన ఉంది.

ఇప్పుడు ప్రధాని మోడీ ముందు కూడా తన రాజకీయ అపరిపక్వతను చాటుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీ ఏపీకి కొత్త అధ్యక్షుడి రాక తథ్యమని టాక్‌ నడుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.