Begin typing your search above and press return to search.

భార‌త క్రికెట్‌లో దాదా క‌థ ముగిసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 5:19 AM GMT
భార‌త క్రికెట్‌లో దాదా క‌థ ముగిసిన‌ట్టేనా?
X
దాదాగా సుప‌రిచితుడైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ క‌థ ముగిసిన‌ట్టేనా అంటే అవున‌నే తెలుస్తోంది. బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వికి రోజ‌ర్ బిన్నీ నామినేష‌న్ వేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జైషా ప్ర‌స్తుతం బీసీసీఐ వ్య‌వ‌హారాల‌ను శాసిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బీసీసీఐ అధ్య‌క్షుడిగా ఉన్న సౌర‌వ్ గంగూలీని సాగ‌నంప‌డానికి జైషా ఆధ్వ‌ర్యంలోని బోర్డు పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. బోర్డు స‌భ్యులంతా జైషా చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో గంగూలీకి ఉద్వాస‌న ఖాయంగా క‌నిపిస్తోంది. 1983లో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన రోజ‌ర్ బిన్నీని తెర‌పైకి తెచ్చిన జైషా బృందం ఆయ‌న‌తో బీసీసీఐ అధ్యక్ష ప‌ద‌వికి నామినేష‌న్ వేయించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కాగా ఇది ఎవరూ ఊహించని అనూహ్య పరిణామ‌మ‌ని చెబుతున్నారు. ఎందుకంటే బోర్డు అధ్యక్ష స్థానం కోసమే గంగూలీ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. పదవుల మధ్య విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) మినహాయింపు కోసం న్యాయపోరాటం చేశాడు. ఇందులో గంగూలీ విజయం సాధించాడు కూడా.

కానీ బోర్డు కార్యవర్గంలో ప‌ట్టు లేక‌పోవ‌డం గంగూలీ కొంప ముంచింద‌ని అంటున్నారు. అందుకే తెరపైకి రోజర్‌ బిన్నీ వచ్చార‌ని చెబుతున్నారు. రోజ‌ర్ బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అధ్యక్ష పదవికి ఆయ‌న నామినేషన్‌ వేశారు. మ‌రోవైపు త‌న ప‌ట్టును కొన‌సాగిస్తూ కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది. ఆయ‌న‌ కూడా ఆ పదవికి నామినేషన్‌ దాఖలు చేశాడు. అక్టోబ‌ర్‌ 18న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి.

కాగా గంగూలీ తాను మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు బోర్డు ఉన్నతాధికారులతో మంతనాలు జరిపిన ఫ‌లితం ద‌క్క‌లేదు. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో గంగూలీ తన పదవిని అట్టిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడ‌ని స‌మాచారం. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు వర్గాలు గంగూలీని కొనసాగించేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

గంగూలీకి ఐపీఎల్‌ కమిషనర్‌ పదవి ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కానీ బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ ఓ సబ్‌ కమిటీకి చీఫ్‌ అయ్యేందుకు తిర‌స్క‌రించాడ‌ని అంటున్నారు. దీంతో ప్ర‌స్తుత ఐపీఎల్ కమిషనర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ స్థానంలో ప్రస్తుత కోశాధికారి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ను ఐపీఎల్‌ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ఇక మహారాష్ట్ర బీజేపీ నేత, ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు ఆశిష్‌ షెలార్ ఇక నుంచి బోర్డు కోశాధికారిగా ఖ‌రార‌య్యారు. అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు అత్యంత సన్నిహితుడు దేవజిత్‌ సైకియా సంయుక్త కార్యదర్శిగా ప‌ద‌విని ద‌క్కించుకోనున్నారు.

కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడైన రాజీవ్‌ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్ష‌ పదవిలో కొనసాగనున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కీలక పదవికి గంగూలీని నామినేట్‌ చేసే అంశం అసలు బోర్డులో చర్చకే రాలేదని అంటున్నారు. దీంతో అనూహ్యంగా దాదాకు గ‌ట్టి షాక్ త‌గిలింద‌ని చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.