Begin typing your search above and press return to search.

ఏపీలో రాహుల్ పాదయాత్రకు టీడీపీ సపోర్టు ఉందా...?

By:  Tupaki Desk   |   19 Sep 2022 1:30 PM GMT
ఏపీలో రాహుల్ పాదయాత్రకు  టీడీపీ సపోర్టు ఉందా...?
X
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీ మీదుగా సాగబోతోంది. రాహుల్ ఏపీలో మరి కొద్ది కాలంలోనే కాలు మోపబోతున్నారు. రాహుల్ గాంధీ ఏపీకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో వేరేగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ అన్ని రకాలుగా చితికిపోయి ఉంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా వైసీపీ శ్రేణులుగా మారిపోయాయి. ఏపీలో నోటా కంటే ఓట్లు తక్కువ తెచ్చుకున్న పార్టీగా 2019 ఎన్నికలలో కాంగ్రెస్ నిలిచింది. పెద్ద నాయకులు ఎవరూ ఆ పార్టీలో ఇపుడు లేరు.

మూడేళ్ళ కాలంలో కాంగ్రెస్ ఏ మాత్రం ఎత్తిగిల్లిన దాఖలాలు కూడా లేవు. అందుకే రాహుల్ గాంధీ అనంతపురంలోని పీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గంలోనే కొంతసేపు పాదయాత్ర చేసి అంటు నుంచి తెలంగాణాకు వెళ్తారని అంటున్నారు. అయినా సరే రాహుల్ పాదయాత్ర ఏపీలో ప్రభావాన్ని కలిగించాలి అంటే కచ్చితంగా జనబలం కనిపించాలి. మరి కాంగ్రెస్ ఎంత మేరకు దాన్ని సమీకరించగలదు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఏపీలో ఉన్న విపక్షం టీడీపీ కాంగ్రెస్ కి రాహుల్ పాదయాత్రకు ఈ విషయంలో సపోర్ట్ గా నిలుస్తుందా అన్న చర్చ అయితే ఉంది మరి.

ఎందుకంటే కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో అయితే బీజేపీ కూటమి లేకపోతే కాంగ్రెస్ కూటమి మాత్రమే అధికారంలోకి రావాలి. బీజేపీ చూస్తే ప్రాంతీయ పార్టీలు దేశంలో అసలు ఉండకూడదు అని కత్తి పట్టుకుని కూర్చుంది. ఆ పార్టీ వీలైనన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలను మింగేస్తోంది కూడా. ఇక ఏపీలో చూస్తే చిత్రమైన పరిస్థితి ఉంది. వైసీపీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తే జనసేన బీజేపీ మిత్రుడిగా ఉంది. టీడీపీ కూడా బీజేపీ స్నేహం కోరుతోంది.

మూడేళ్ళుగా మోడీని కానీ బీజేపీని కానీ పల్లెత్తు మాట అనకుండా కాలం నెట్టుకుని వస్తోంది. అయితే ఇపుడు దీని వెనక కూడా ఆసక్తికర‌మైన కధనాలు వినిపిస్తున్నాయి. మనసులో అయితే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం గెలవకూడదు అని టీడీపీకి ఉన్నా బయటకు మాత్రం భయపడుతూ బీజేపీని ఏమీ అనడంలేదు అని అనుకుంటున్నారు.

ఎందుకంటే బీజేపీ మళ్లీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వస్తే గట్టిగా పాతుకుపోతుంది. అపుడు బీజేపీ రాజకీయ సయ్యాట మామూలుగా ఉండదు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను పూర్తిగా లాగేస్తుంది. ముందుగా బలహీనంగా ఉన్న పార్టీలను విపక్షంలో ఉన్న పార్టీలను పని పడుతుంది. ఏపీలో చూస్తే టీడీపీ ఓటు బ్యాంక్ మీద కన్నేసి బీజేపీ ఏమైనా చేస్తుంది అన్న ఆలోచనలు అయితే టీడీపీలో ఉన్నాయి.

దానికి తోడు దేశంలో మారుతున్న రాజకీయం బీజేపీకి వ్యతిరేకంగా కూడుతున్న ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా టీడీపీని ఆలోచనలో పడవేస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా బాగా సాగుతోంది. జనాదరణకు నోచుకుంటోంది. ఈసారి కాంగ్రెస్ నాయకత్వాన విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో టీడీపీ గెలిస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలో కూడా పుంజుకుంటుంది.

అపుడు అది వైసీపీకి అతి పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే. ఆ విధంగా సేఫ్ జోన్ లో టీడీపీ ఉండవచ్చు. అదే బీజేపీ కేంద్రంలో వస్తే టీడీపీకి ఇబ్బంది. సో ఈ రకమైన ఆలోచనలు ఉన్న టీడీపీ ఏపీకి వస్తున్న రాహుల్ పాదయాత్రను ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు అన్న టాక్ అయితే ఉంది. అనంతపురం వస్తున్న రాహుల్ కి పెద్ద ఎత్తున జనాలను సమకూర్చి ఫుల్ సక్సెస్ చేసే బాధ్యతను టీడీపీ స్వీకరిస్తోంది అని కూడా అంటున్నారు.

అదే విధంగా అమరావతి రైతులు కూడా ఏపీకి వస్తున్న రాహుల్ ని పాదయాత్రలో కలుస్తారు అని అంటున్నారు. ఆ విధంగా రాహుల్ మద్దతుని డైరెక్ట్ గానూ, ఇండైరెక్ట్ గానూ పొందడం ద్వారా రేపటి జాతీయ రాజకీయాలలో బొమ్మ అటు నుంచి ఇటు అయినా తాము సేఫ్ జోన్ లో ఉండేలా టీడీపీ పధక రచన చేస్తోంది అని అంటున్నారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలన్న టీడీపీ బలమైన కోరికకు నిదర్శనంగా రాహుల్ పాదయాత్రకు టీడీపీ సపోర్ట్ ఉండబోతోంది అన్న చర్చ అయితే ఉంది. మరి ఇవన్నీ బీజేపీకి తెలియకుండా ఉంటాయా.

టీడీపీ ఎంత ఇండైరెక్ట్ గా చేసినా బీజేపీకి ఉన్న వేగులు, నిఘా ద్వారా ఈ విషయాలు తెలిస్తే అపుడు ఏపీ రాజకీయాల్లో కూడా అనేక కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఏదో ఒక రోజున టీడీపీ తన మనసులోని మాటను బయటపెడితే జాతీయ రాజకీయాల్లోనూ అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇదంతా అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ మీద దానికి టీడీపీ సపోర్టు మీద ఆధారపడి ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.