Begin typing your search above and press return to search.

సీపీఐ జాతీయ మహాసభలు తేల్చింది ఇదేనా?

By:  Tupaki Desk   |   20 Oct 2022 6:48 AM GMT
సీపీఐ జాతీయ మహాసభలు తేల్చింది ఇదేనా?
X
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) జాతీయ మహాసభలు విజయవాడలో ఐదు రోజులపాటు భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతమున్న డి.రాజానే తిరిగి ఎంపికయ్యారు. కాగా వచ్చే ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి, 2024 ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో పొత్తులు, గెలుపు వ్యూహాలపై చర్చించకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే సీపీఐ నేతలు పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం జరిగిన సీపీఐ జాతీయ మహాసభలను విశ్లేషిస్తున్న రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు కొన్ని స్థానాల్లో చాలా బలంగా ఉండేవి. ఆ స్థానాల్లో ఆ పార్టీలు తప్ప మరో పార్టీ గెలవలేదనే టాక్‌ ఉండేది. ఇలాంటివాటిలో విజయవాడ, మంగళగిరి, రంపచోడవరం, గోపాలపురం తదితర స్థానాలు ఉండేవి. అయితే కాలక్రమేణా ఇక్కడ అవి బలాన్ని పోగొట్టుకున్నాయి.

ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ, జాతీయ కార్యదర్శిగా నారాయణ ఉన్నారు. వీరు ప్రజా సమస్యలపైనే బాగానే పోరాటం చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారని చెబుతున్నారు. అయితే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారని అంటున్నారు. కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై విమర్శలకే పరిమితమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కమ్యూనిస్టు పార్టీలకు స్నేహహస్తం చాచారు. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చే ఎన్నికల్లో సీపీఐకి కొన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.

అదేవిధంగా ఏపీలో టీడీపీ–జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు కూడా అందులో చేరాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌ భేటీపై రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ–జనసేన మధ్య పొత్తు కుదిరితే మంచిదే అని వ్యాఖ్యానించారు. తద్వారా తమ మద్దతు ఎటువైపో తేల్చిచెప్పేశారు.

అలాగే మూడు రాజధానుల అంశానికి సంబంధించి సీపీఐ జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. తమ మద్దతు అమరావతికి మాత్రమే అని తేల్చిచెప్పింది. అమరావతి రైతులు ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రకు మద్దతు కూడా ప్రకటించింది.

తెలంగాణలో కేసీఆర్‌ స్నేహహస్తం చాచడంతో అక్కడ పుంజుకునే అవకాశం ఉందని సీపీఐ భావిస్తోంది. అలాగే ఏపీలోనూ టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే వాటితో చేరి బలపడాలని సీపీఐ భావిస్తోందని చెబుతున్నారు.

అయితే.. ఇక్కడ అనుసరించబోయే వ్యూహాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పొత్తు ఎవరితో అనేది చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.