Begin typing your search above and press return to search.

ఆ 19 టయోటా వాహనాలు జగన్‌ కోసమేనా?

By:  Tupaki Desk   |   3 Jan 2023 8:53 AM GMT
ఆ 19 టయోటా వాహనాలు జగన్‌ కోసమేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో పోలీసు శాఖ కొత్తగా 19 టయోటా ఫార్చూనర్‌ వాహనాలను కొనుగోలు చేసింది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) అధికారులు వీటిని పరీక్షించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటిలో 17 వాహనాలు నలుపు, 2 వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. వీవీఐపీల భద్రతకు వీలుగా వీటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చుతారని చెబుతున్నారు. ఈ వాహనాలు ఎవరి కోసం కొనుగోలు చేశారనే దానిపై పూర్తి గోప్యత పాటిస్తున్నారు. అయితే సీఎం జగన్‌ కోసమే కొన్నారన్న ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఆయన తరచూ వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆయన ప్రయాణించే రహదారుల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. కేబుల్‌ వైర్లను తొలగిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో జగన్‌ మరింత చురుగ్గా రాష్ట్రమంతా పర్యటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన భద్రత కోసమే కొత్తగా 19 టయోటా ఫార్యూనర్‌ వాహనాలను కొనుగోలు చేశారని సమాచారం.

వాస్తవానికి జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కోసం ప్రభుత్వం కొత్తగా 6 నల్ల రంగు టయోటా ఫార్చూనర్‌ వాహనాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2019 జూన్‌ 17 నుంచి వీటిని వాడుతున్నారు. ఆ ఆరు వాహనాలకు అప్పట్లోనే రూ.5 కోట్లు అయి ఉంటుందని అంచనా.

సీఎం నివాసం ఉన్న తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి, సచివాలయం, అసెంబ్లీకి వెళ్లి వచ్చేందుకు, విజయవాడ, గుంటూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఈ ఆరు ఫార్చూనర్‌ వాహనాలను వినియోగించారు. ఇవి ఇప్పటివరకూ 10వేల నుంచి 15వేల కిలోమీటర్లకు మించి తిరిగి ఉండవని చెబుతున్నారు.

తాజాగా కొత్తగా కొనుగోలు చేసిన 19 వాహనాలకు ఏకంగా రూ.15.77 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇంత భారీ మొత్తం వెచ్చించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు ఈ కొత్త వాహనాలు మంత్రుల కోసం కాదని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 25 మంది మంత్రులున్నారు. కొనుగోలు చేసినవి 19 వాహనాలే. ఈ నేపథ్యంలో ఈ వాహనాలు మంత్రుల కోసం కాకపోవచ్చని అంటున్నారు.

కాగా ప్రస్తుతం హై ఎండ్‌ టయోటా ఫార్చూనర్‌ వాహనం (డీజీల్‌ వెర్షన్‌) ఒక్కో దాని ఆన్‌రోడ్‌ ధర రూ.63 లక్షల వరకూ ఉందని సమాచారం. అదే పెట్రోల్‌ వెర్షన్‌ అయితే రూ.43 లక్షల వరకూ ఉందని అంటున్నారు.

ఇప్పుడు కొనుగోలు చేసిన హై ఎండ్‌ టయోటా డీజిల్‌ వెర్షన్‌ 19 వాహనాలకు రూ.11.97 కోట్లు, వాటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చడానికి అదనంగా సుమారు రూ.20 లక్షల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు. అంటే ఈ 19 వాహనాలను బుల్లెట్‌ ఫ్రూప్‌గా మార్చడానికి రూ.3.80 కోట్లు అవుతుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ వాహనాలకు రూ.15.77 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు అవుతుందని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.