Begin typing your search above and press return to search.

సిటీ ఆఫ్ డెస్టినీలో సోముకే ఎందుకిలా....?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 PM GMT
సిటీ ఆఫ్ డెస్టినీలో సోముకే ఎందుకిలా....?
X
అదేంటో బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు విశాఖకు వచ్చిన ప్రతీ సారీ ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇదే నెలలో కేవలం పది రోజుల తేడాలో సోముకు రెండు అవమానాలు జరిగాయని అంటున్నారు. మొదటిది నిజంగా జరిగిందా లేదా తెలియదు కానీ సోముని ప్రధాని నరేంద్ర మోడీయే గుర్తుపట్టలేదని ఒక వర్గం మీడియా పని గట్టుకుని మరీ ప్రచారం చేసి ఆయనని ఇరకాటంలో పెట్టింది.

ఇపుడు చూస్తే లేటెస్ట్ గా మరోటి అలాంటి సంఘటనే విశాఖ టూర్లో జరిగింది. విశాఖలో కర్మయోగి కార్యక్రమం ప్రారంభించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తే ఆయనతో ఆ సమావేశంలో పాలుపంచుకోవడానికి సోము వీర్రాజు వెళ్లారు. అయితే అక్కడ పాపం సోము వీర్రాజుని లోపలికి వెళ్ళకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అంతే కాదు, మీరెవరో తెలియదు అని చెప్పారట.

దాంతో అక్కడే వీర్రాజు తాను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ని తననే అడ్డుకుంటారా అంటూ వారితో వాదనకు దిగారు. ఇదంతా చూసిన కిషన్ రెడ్డి వచ్చి ఆయన్ని లోపలికి వచ్చేలా చేశారు. ఈలోగా జరగాల్సిన అవమానం అయితే జరిగిపోయింది. వీర్రాజును చూస్తే ఎందుకు ఎవరూ గుర్తు పట్టరని ఆయన అనుచరులే మధనపడాల్సి వస్తోంది.

ఇక సీన్ కట్ చేస్తే ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టులో మొదలెట్టి నేవీ గెస్ట్ హౌస్ లో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ దాకా సోము వీర్రాజుని ఎవరూ గుర్తు పట్టలేదని మీడియా రాతలు రాసింది. అయితే ప్రధాని అందరినీ పరిచయం చేసుకోమన్నారని, దాంతో వీర్రాజు తన పేరు ముందు చెప్పుకుని అందరినీ పరిచయం చేశారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.

అయినా కూడా ఏపీలో బీజేపీ ప్రెసిడెంట్ వీర్రాజు అంటే ప్రధానికే తెలియదు అంటూ కధనాలు మాత్రం రాసేశారు. ఈ పరిణామంతో వీర్రాజు వస్తే విశాఖలో అంటే ఎపుడూ ఇంతనా అని ఆయన అభిమానులు బాధపడుతున్నారు అంటే అర్ధముందిగా.

అందరికీ ఆనందాన్ని అహ్లాదాన్ని పంచే విశాఖ వీర్రాజు విషయంలో మాత్రం ఎందుకు ఇలా విషాదంగా మారుతోంది అన్నదే ఆయన అనుచరులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి వీర్రాజుది విశాఖ పక్కన ఉన్న తూర్పుగోదావరి జిల్లావే. ఆయన ఎన్నో సార్లు గతంలో విశాఖ వచ్చారు.

నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో ఉంటున్నారు. ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. ఇన్ని చేసినా పెద్దాయన అంటే ప్రముఖులు వచ్చినపుడు ఎవరో మాకు తెలియదు అని కేంద్ర బలగాలు అనడం బాధాకరమే కదా. అంతే కాదు సొంత పార్టీ వారు కూడా ఎవరు అని అడిగారని వార్తలు రాయడం ఇబ్బందే కదా.ఏది ఏమైనా స్మార్ట్ సిటీలో సోముకే ఇలా ఎందుకు జరుగుతోంది మరి అంటే జవాబు వెతకాల్సిందే మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.