Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఐటీ, ఈడీ క్యాంప్ ఆఫీసులు.. కేసీఆర్ ను వేటాడేందుకేనా?

By:  Tupaki Desk   |   22 Nov 2022 2:30 PM GMT
హైదరాబాద్ లో ఐటీ, ఈడీ క్యాంప్ ఆఫీసులు.. కేసీఆర్ ను వేటాడేందుకేనా?
X
అనుకున్నట్టే కేంద్రంలోని బీజేపీ తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. వారి లూప్ హోల్స్ వెతికి మరీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పురిగొల్పుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం, కేసినో స్కాంలో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు అరెస్ట్ లు మొదలుకావడంతో కీలక టీఆర్ఎస్ నేతలంతా అలెర్ట్ అవుతున్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలను రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ పై అటాక్ చేస్తోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనూ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నేతలను హెచ్చరించారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగవచ్చని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ లో చాలా చోట్ల ఈడీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే ఐటీ కూడా రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది.

ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేతలపై దాడులు జరుగుతున్నాయి. మంత్రి గంగుల కరుణాకర్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ తదితరులపై ఈడీ దాడులు చేశారు.. నేడు మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై ఆదాయపన్ను శాఖ దాడులు మొదలయ్యాయి..

మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడికి సంబంధించిన ఇళ్లు, సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. అలాగే కొంపల్లిలోని పామ్ మెడోస్ విల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 బృందాలు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. మల్లారెడ్డి యూనివర్సిటీ, కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుమార్తె, అల్లుడు, కుమారుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి సోదరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కొంపల్లిలోని ఓ విల్లాలో నివాసం ఉంటున్న మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బోయిన్‌పల్లి, మేడ్చల్, మల్కాజిగిరిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. “కేంద్ర సంస్థలు హైదరాబాద్‌కు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు ఈడీ, సీబీఐలు హైదరాబాద్ లో క్యాంపు కార్యాలయాలు తెరిచినట్లే. ఇలాంటి ప్రతీకార రాజకీయాలను ప్రజలు సహించరని’ టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. మరి ఇవి ఎటువైపు దారితీస్తాయన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.