Begin typing your search above and press return to search.

ఆయ‌న చెప్పారు..ఐటీ ఉద్యోగాలు ఊడ‌వ‌ట‌

By:  Tupaki Desk   |   17 May 2017 6:29 AM GMT
ఆయ‌న చెప్పారు..ఐటీ ఉద్యోగాలు ఊడ‌వ‌ట‌
X
దేశీయ ఐటీ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడనుంది అనే వార్తలు ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అలాంటిదేమీ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఐటీ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను తొలగిస్తారని అంచనా వేయడం సరికాదని, రానున్న రోజుల్లో మరిన్ని నియామకాలు పెరుగుతాయి గానీ.. ఉద్యోగుల కోత ఉండబోదని ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ స్పష్టం చేశారు. అంతేగాక, ఐటీరంగం 8 నుంచి 9శాతం వృద్ధి సాధించనుందని పేర్కొన్నారు. కొన్ని సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను పునరుద్ధరించలేదని, అంతేగానీ ఉద్యోగాల కోత అనేది జరగబోదని చెప్పారు.

దేశీయ ఐటీ దిగ్గ‌జాలైన ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా స‌హా అంత‌ర్జాతీయంగా పేరున్న కాగ్నిజెంట్‌ లాంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా - ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వీసా నిబంధనల కారణంగా సదరు కంపెనీలుఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్‌ హంటర్స్‌ ఇండియా వెల్లడించిన విషయాలు మరింత ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది 1.75-2.0లక్షల వరకు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు తొలగించే అవకాశముందని, మరో మూడేళ్ల పాటూ ఇంతే సంఖ్యలో ఇంజనీర్లు తొలగింపునకు గురవుతారని హెడ్‌ హంటర్స్‌ పేర్కొంది. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో సేవలందించే సగం మంది రాబోయే 3-4 ఏళ్లలో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఉండరని హెడ్‌ హంటర్స్‌ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ప‌రిణామంపై తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి `వార్షిక అంచనాల్లో భాగంగా కొన్ని కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు. అయితే దీని వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఊహించడం సరైనదికాదు` అని అరుణ అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ఐటీ రంగంలో 5లక్షల కొత్త ఉద్యోగులను తీసుకోగా.. భవిష్యత్తులో మరిన్ని నియామకాలు జరుగుతాయన్నారు. అంతేగాక, ఐటీ రంగంలో 8 నుంచి 9 శాతం వృద్ధి సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యాలు, పనితీరుపరంగా కొందర్ని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలున్నప్పటికీ.. అవి ప్రతిఏటా జరిగేలాంటి సాధారణ కోతలేనని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/