Begin typing your search above and press return to search.

1441 ప్రాణాలు పోయేంత తప్పు ఇటలీ ఏం చేసింది?

By:  Tupaki Desk   |   16 March 2020 7:30 PM GMT
1441 ప్రాణాలు పోయేంత తప్పు ఇటలీ ఏం చేసింది?
X
కేవలం యాభై రోజుల తేడా తో ఆ దేశం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పర్యాటకుల తో కళకళలాడుతూ.. నిత్య యవ్వనం తో మిడిసిపడే ఇటలీ లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక వణికిపోతున్న ప్రజలు.. వీధులన్ని నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఎందుకిలా జరిగింది? ఎక్కడ తప్పు దొర్లింది? 1441 మంది ప్రజల ప్రాణాలు పోయేంతగా ఇటలీ ప్రభుత్వం ఏం తప్పు చేసిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

జనవరి 29 నాటికి ఇటలీ లో కరోనా పాజిటివ్ కేసులు కేవలం రెండు మాత్రమే. కట్ చేస్తే.. మార్చి 15 పరిస్థితి చూస్తే.. ఆ దేశంల కరోనా ముప్పు ఎంత తీవ్రంగా వ్యాపించిందో గణాంకాలు స్పష్టం చేస్తాయి. ఆదివారం నాటికి ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 21,157 కాగా.. మరణాల సంఖ్య 1441గా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరెంత పెరుగుతుందన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇంత తీవ్రమైన పరిస్థితి ఎందుకొచ్చింది? అంతమంది ఎందుకు మరణించారు? అన్న విషయంలోకి వెళితే.. కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి.

జనవరి 29న రెండుపాజిటివ్ కేసులు నమోదైన వెంటనే ఇటలీ సర్కారు స్పందించింది. ఆర్నెల్ల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనా నుంచి విమాన రాకపోకల్ని నిషేధించారు. అయినప్పటికీ ఇంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడటానికి కారణం నిర్లక్ష్యం.. కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయటమేనని చెబుతున్నారు. తొలుత స్వల్ప దగ్గు..జలుబు కేసులు నమోదైనప్పుడు వీటిని సాధారణ ఫ్లూ జ్వరాలుగా పరిగణిస్తూ తీవ్రతను గుర్తించటం లో అధికారులు విఫలమయ్యారు. అదే ఇప్పుడా దేశానికి పెను శాపంగా మారింది.

జనవరి లో ఇటలీ ఆసుపత్రుల్లో న్యూమోనియా కేసులు కుప్పలుతెప్పలుగా నమోదు కావటం.. ఈ రోగులకు కరోనా పరీక్షలు చేయటం లో ఫెయిల్ కావటం కూడా కారణంగా చెబుతున్నారు. అన్నింటికి మించిన ఒక రోగి విషయంలో దొర్లిన తప్పు.. ఇప్పుడీ పరిస్థితికి ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 18న కొడొగ్నో పట్టణంలో ఒక రోగికి తీవ్ర జ్వరం ఉన్నా.. వైద్య సిబ్బంది దాన్ని కరోనాగా గుర్తించలేదు. ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత వైరస్ వ్యాప్తి ఊపందుకోవటమే కాదు.. కరోనా కేసులు పాజిటివ్ గా నమోదు కావటానికి కారణమైందంటున్నారు.

తొలుత స్పందించాల్సిన ఇటలీ యంత్రాంగం.. పరిస్థితి చేయి దాటిన తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇటలీ ఆర్థిక రాజధాని మిలన్ తో పాటు దాదాపు 1.60 కోట్ల మందిని ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేశారు. కనీవినీ ఎరుగని ఆంక్షల్ని తీసుకొచ్చారు. కరోనాపై యుద్ధాన్నే ప్రకటించారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోగులు ఆసుపత్రులపై పోటెత్తారు. ఇదిప్పుడు వేలాది మంది కరోనా బారిన పడటానికి.. వందలాది మంది మరణించటానికి కారణమైందంటున్నారు.