Begin typing your search above and press return to search.

కేసీఆర్ బెదిరింపుల‌కు...ఆర్టీసీ కార్మికులు భ‌య‌ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:59 AM GMT
కేసీఆర్ బెదిరింపుల‌కు...ఆర్టీసీ కార్మికులు భ‌య‌ప‌డ్డారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం ఫ‌లితం ఇచ్చిందా? ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో...మూడు రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధులలో చేరి బేషరతు పత్రాలను సమర్పించాలని లేదంటే ఉద్యోగాలు ఉండ‌వ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఫ‌లితం ఏంటి? అంద‌రిలో ఇదే ఆస‌క్తి. దీనికి ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సమ్మె విరమించేది లేదని అన్నారు.హామీ లేకుండా కార్మికులు విధులకు వెళ్లరని తేల్చిచెప్పారు.

దాదాపు ఐదు గంట‌ల పాటు ఆర్టీసీపై క్యాబినెట్ లో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కార్మికులు - చిరు ఉద్యోగుల పొట్టలు కొట్టే సంస్కృతికి తమది కాదన్నారు. ఆర్టీసీ కార్మికులను తమ బిడ్డలుగానే భావించి అవ‌కాశం ఇస్తున్నామ‌ని - ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోక‌పోతే.… చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రూట్ల‌ను ప్రైవేటు ప‌రం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

దీనిపై తాజాగా ఆర్టీసీ జేఏసీ స‌మావేశ‌మై చ‌ర్చించింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కార్యాలయంలో జేఏసీ నేతలు స‌మావేశ‌మ‌య్యారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి..? సమ్మెను మరింత ఉదృతంగా ఎలా చేయాలి..? ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా ముందుకు సాగాలనే అంశాలపై చర్చిస్తున్నారు. చ‌ర్చించే ముందు - చ‌ర్చ‌ల అనంత‌రం అశ్వ‌త్థామ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....కేసీఆర్ వ్యాఖ్యల్ని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తుంద‌న్నారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికి వాళ్లు ఉద్యోగంలో చేరుతున్నారని - కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు.నవంబర్ 4న అన్నీ రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర కార్మికుల దీక్ష - 5న రహదారుల దిగ్భంధం, 6న అన్నీడిపోల ముందు నిరసనలు - 7న కార్మికుల కుటుంబాలు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష, 8న ఛలో ట్యాంక్ బండ్, 9న ట్యాంక్ బండ్ పై దీక్ష నిరసన కార్యక్రమాలు చేపట్టేలా జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నామ‌ని పేర్కొంటూ వాటిని కొనసాగిస్తామ‌న్నారు. సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని, కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు.