Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును కాపీ కొడుతున్న జ‌గ‌న్!

By:  Tupaki Desk   |   5 Aug 2022 1:30 PM GMT
చంద్ర‌బాబును కాపీ కొడుతున్న జ‌గ‌న్!
X
ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమ‌లింగం అన్న‌ట్టు ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ తీరు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల ప‌రిష‌త్, జెడ్పీటీసీ, మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఈ నేప‌థ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును సైతం కుప్పంలో ఓడిస్తామ‌ని జగ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు చెబుతున్నారు. 175కి 175 వ‌స్తాయ‌ని చెప్పుకుంటున్నారు.

ఇందులో భాగంగా మొట్ట‌మొద‌ట‌గా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపిక చేసిన వంద మంది క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. అయితే వీరిలో కార్య‌క‌ర్త‌ల కంటే మండ‌ల పార్టీ, గ్రామ పార్టీల అధ్య‌క్షులు, వివిధ మార్కెట్ యార్డుల చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, దేవాల‌యాల పాల‌క సంస్థ‌ల చైర్మ‌న్లే ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిలో ఒక్క‌రు కూడా నిజ‌మైన క్షేత్ర స్థాయి కార్య‌క‌ర్త ఒక్క‌రు కూడా లేరని చెబుతున్నారు. ప్ర‌స్తుతం కుప్పం ఇన్చార్జిగా ఉన్న భ‌ర‌త్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పారు.

త‌న‌కు పులివెందుల ఎలాగో కుప్పం కూడా అలాగే అంటూ సెంటిమెంట్ డైలాగుల‌ను జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా పులివెందుల‌కు కూడా తాము నీళ్లు ఇచ్చామ‌ని.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు కూడా పులివెందుల రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌ని త‌మ ప్ర‌భుత్వ‌మే నీళ్లు ఇచ్చింద‌ని చంద్ర‌బాబు చెప్పుకున్నారు. తామే నీళ్లిచ్చాం కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పులివెందుల‌లో ఓడిపోతాడ‌ని.. టీడీపీ జెండా రెప‌రెప‌లాడుతుంద‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు చెప్పారు.

అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీచేసిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డినే ఓడించి పులివెందుల గ‌డ్డ‌పైనే జ‌గ‌న్ కు చంద్ర‌బాబు స్వీట్ షాక్ ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వచ్చేట‌ప్ప‌టికి చంద్ర‌బాబు ఆశించన ఫ‌లితాలు వ‌చ్చాయి. వైఎస్ జ‌గ‌న్ కు రాష్ట్రంలోనే అత్య‌ధిక మెజారిటీ వ‌చ్చింది. అంతేకాకుండా అదికారాన్ని కూడా ద‌క్కించుకున్నారు.

ఇప్పుడు అచ్చం జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబు మాదిరిగానే పులివెందుల‌లానే కుప్పం కూడా త‌నకు ముఖ్య‌మంటూ చెబుతున్నారు. రెండు రోజుల్లో దాదాపు 40 కోట్ల రూపాయ‌లు ఇస్తున్నాన‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోమ‌ని చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ భ‌ర‌త్ త‌న త‌ర‌ఫున దీన్ని ప‌ర్య‌వేక్షిస్తార‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో దిమ్మ‌తిర‌గ‌డం ఖాయ‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. చంద్ర‌బాబును కాపీ కొట్టి జ‌గ‌న్ చేస్తున్న రాజ‌కీయం వ‌ర్క‌వుట్ కాద‌ని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పూర్తి వ్య‌తిరేక కోణంలో జ‌రుగుతాయ‌ని.. ఫ‌లితాలు కూడా అలాగే ఉంటాయంటున్నారు.