Begin typing your search above and press return to search.

అమిత్ షా‌కు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్.. ఎట్టకేలకు భేటీ

By:  Tupaki Desk   |   22 Oct 2019 11:30 AM IST
అమిత్ షా‌కు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్.. ఎట్టకేలకు భేటీ
X
ఏపీ సీఎం జగన్‌కు ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింటుమెంటు దొరికింది. సోమవారమే దిల్లీ చేరుకుని నిరీక్షిస్తున్న ఆయనకు మంగళవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో షా అపాయింటుమెంటు దొరికింది. అమిత్ షా జన్మదినం కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే కారణంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి - వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో పాటు గతంలో కొద్దికాలం బీజేపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు గట్టిగా ప్రయత్నించడంతో బీజేపీ పెద్దలు సరేనన్నట్లు సమాచారం.

కాగా అమిత్ షా‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఇద్దరి మధ్య అర్ధగంటకు పైగా భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ - అమిత్‌ షాతో చర్చించారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయ - ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అవుతారు. ఈ రెండు భేటీల్లో ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

కాగా జగన్‌కు అమిత్ షా అపాయింట్‌ మెంట్ దొరకడం లేదంటూ మీడియాలో వస్తున్న కథనాలపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదంతా దుష్ప్రచారమంటూ తిప్పికొడుతున్నాయి. అయితే, సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జగన్ దిల్లీలో ఎలాంటి భేటీలు లేకుండా తన నివాసానికే పరిమితం కావడంపై మాత్రం వైసీపీ వర్గాల నుంచి స్పందన లేదు.