Begin typing your search above and press return to search.

ఐదు గ్రామాల మీద జగన్ స్టాండ్ ఏంటి?

By:  Tupaki Desk   |   17 April 2016 3:19 PM IST
ఐదు గ్రామాల మీద జగన్ స్టాండ్ ఏంటి?
X
పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్ని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారంటూ శ్రీరామనవమి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే. అయితే.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే కాదు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ విషయం మీద స్పందించింది లేదు.

నిజానికి ఏపీ ముఖ్యమంత్రిని చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీయటమే కాదు.. ఏపీ ప్రజల్లో మరింత పట్టు పెంచుకోవటానికి ఐదు గ్రామాల వ్యవహారం అక్కరకు వస్తుంది. అయితే.. ఈ వ్యవహారంపై జగన్ పెదవి విప్పితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తగువు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధంగా లేని జగన్.. ఐదు గ్రామాల మీద స్పందిస్తారన్న నమ్మకం లేనట్లే.

బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఏపీకి సంబంధించి కీలకమైన విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి.. ఏపీ విపక్ష నేతలు ఇద్దరూ మౌనంగా ఉండటం. ఓపక్క ఏపీకి చెందిన ఐదు గ్రామాలు తాము కలుపుకోనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నా.. ఏపీ సీఎం.. విపక్ష నేత ఇద్దరూ నోరు విప్పకపోవటం గమనార్హం. ఈ ఇష్యూ మీద జగన్ తన స్టాండ్ ఏమిటన్నది క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. తన మౌనంతో పలు సందేహాలు రేకెత్తిస్తున్న చంద్రబాబు బాటలోనే జగన్ పయనిస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా ఐదు గ్రామాల మీద తన విధానం ఏమిటో జగన్ స్పష్టం చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.