Begin typing your search above and press return to search.

బంద్ స‌క్సెస్‌..అదొక్క‌టే జ‌గ‌న్‌ కు బాధ‌

By:  Tupaki Desk   |   24 July 2018 5:50 PM GMT
బంద్ స‌క్సెస్‌..అదొక్క‌టే జ‌గ‌న్‌ కు బాధ‌
X
ప్రత్యేక హోదాపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైసీపీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతం అయింది. తెల్లవారుజాము నుంచే బస్సు డిపోల ముందు - ముఖ్య కూడళ్లలో నేతలు ఆందోళనకు దిగారు. ఇక ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు - నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. వైసీపీ బంద్‌ తో విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. వాణిజ్య సముదాయాలు తెరచుకోలేదు. పెట్రోల్‌ బంక్‌ లు - షాపులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. అయితే పలు చోట్ల ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

విశాఖపట్నం జిల్లాలోని మద్దెలపాలెంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంద్‌ లో భాగంగా మద్దెలపాలెం జంక్షన్‌ లో బొత్స సత్యనారాయణ - ఎమ్మెల్యే వినయ్‌ కుమార్‌ ఆందోళనకు దిగారు. వీరితో పాటు ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. బొత్స వాహనం ఎదుట బైఠాయించిన మహళలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌ లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెలేలు రోజా - నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌ లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తూ ఉత్కంఠ సృష్టించారు. పులివెందుల బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ చేపడుతున్న వైఎస్ మనోహర్ రెడ్డిని పోలీసుల అరెస్ట్ చేశారు. రాయచోటిలో బంద్ పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి - వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగరంలోని సంధ్య కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లాతో పాటు మరికొంత మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో హోదా కోసం శాంతియుతంగా నిర్వహిస్తోన్న రాష్ట్ర బంద్‌ లో విషాదం చోటు చేసుకుంది. హోదా కావాలని నిరసిస్తూ బుట్టాయిగూడెంలో బంద్‌ లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. మాజీ ఎమ్మెల్యే - వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బంద్‌లో పాల్గొన్న పార్టీ కార్యకర్త దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే దుర్గారావు మృతిచెందారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వైఎస్సార్‌ సీపీ నేతలు - శ్రేణులను అరెస్టులు చేసి.. గృహనిర్బంధాలు విధించి.. బంద్‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా.. వాటన్నింటినీ ఛేదించి.. విజయవంతంగా పార్టీ నేతలు బంద్‌ నిర్వహించారు. ప్రజలు - పలు ప్రజాసంఘాలు వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చిన బంద్‌ లో స్వచ్ఛందంగా పాల్గొని.. విజయవంతానికి కృషిచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ బంద్‌ ను విజయవంతం చేసిన అందిరికీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. బంద్‌ సక్సెస్‌ పై విశాఖలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బంద్‌ ను విజవంతం చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ సందర్భంగా ఒక వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేసిన బొత్స... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అసలు ప్రత్యేక హోదాకు టీడీపీ అనుకూలమా?... వ్యతిరేకమా? చెప్పాలని ప్రశ్నించిన బొత్స... తెలుగుదేశం - సీఎం చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగానే ఇవాళ బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. హోదా కంటే ప్యాకేజీయే మంచిదని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసిన బొత్స... ఇప్పుడు ఆ మాట అంటే విరుచుకుపడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ - పవన్‌ తో కలిసి చంద్రబాబు పోటీచేశారని... మేం గతంలో ఒంటరిగానే పోటీ చేశాం... ఇప్పుడూ అదేవిధంగా ఎన్నికల బరిలో దిగుతామన్నారు. కానీ, బీజేపీతో కుమ్మక్కయ్యారని వైసీపీపై అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబు మాకు ఇప్పటికీ మిత్రుడేనని హోం మంత్రి లోక్‌ సభలో చెప్పేశారు... రక్షణ మంత్రి భర్తను మీ పక్కనే పదవిలో కూర్చో బెట్టుకుని మీరు బీజేపీని పైపైన తిడతారని విమర్శించిన బొత్స... లోపల మీ ప్రేమ అలాగే ఉంది... కానీ, మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, బంద్‌ పై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ బంద్‌ సక్సెస్ అయింద‌న్నారు. అయితే, బంద్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో చనిపోయారని - ఆయన మరణానికి చంద్రబాబే కారణమని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.