Begin typing your search above and press return to search.

జగన్ కూర్పులో రాజకీయ నేర్పు

By:  Tupaki Desk   |   6 Jun 2019 1:54 PM GMT
జగన్ కూర్పులో రాజకీయ నేర్పు
X
ఇక 36 గంటల్లో ఏపీ మంత్రులు ఎవరో లోకానికి తెలిసిపోనుంది. అయితే, ఎంపికయిన కొందరికి ఇప్పటికే సమాచారం అందింది. మొత్తం లిస్టును జగన్ ఇప్పటికే తయారుచేశారు. ముఖ్యమంత్రి వంటి పదవులకు జగన్ కొత్త వాడే కావచ్చు గాని ఇప్పటివరకు జరిగిన నిర్ణయాలను చూస్తే అతని ఆలోచనలు వ్యూహాత్మకంగా ఉన్నాయనే స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ పుట్టాక స్వతంత్రంగా అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. దీంతో వైసీపీ అధినేత తొలి పదవుల పంపకం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి, అంచనాలను అందుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారు. దీనికి కేబినెట్ కూర్పే చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

సామాజిక వర్గాలను అన్నింటినీ సమతూకంతో జగన్ కేబినెట్ లో ఉండేలా చూస్తున్నారు. ముఖ్యంగా తనను అణవణువూ సపోర్టు చేస్తూ తనను ఈ స్థాయికి చేర్చిన - తనకు కష్టాల్లో అన్నిటికీ ఓర్చుకుని అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ 7 పదవులు జగన్ కేటాయించనున్నారు. ఇక ఎన్నికల ముందు కాపులను ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ ఇవ్వని జగన్... పదవుల్లోనూ వారికి 2 మాత్రమే కేటాయించనున్నారట. ఇక తెలుగుదేశాన్ని వదిలి తనకు అండగా నిలిచిన బీసీ సామాజిక వర్గానికి మంచి ప్రాధాన్యత ఇస్తూ వారికి ఆరు పదవులు ఇవ్వనున్నారట జగన్.

ఇక మిగతా వర్గాలలో కమ్మ సామాజిక వర్గానికి 2 - ఎస్సీ మాల 2 - ఎస్సీ మాదిగ 1 - ఎస్టీ 1 - క్షత్రియ 1 - ముస్లిం మైనార్టీ కోటాలో ఒకరికి మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. జంబో కేబినెట్ ఏర్పాటుచేస్తే బ్రాహ్మణ - వైశ్య సామాజిక వర్గాలకు చెరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

అయితే, తొలుత చిన్న సంఖ్యలో కేబినెట్ ని ఏర్పాటుచేద్దాం అనుకున్న జగన్... ఒకేసారి పూర్తి కేబినెట్ ను ఏర్పాటుచేసి మధ్య మధ్యలో అసంతప్తికి అనవసరం గాసిప్ లకు అవకాశం ఇవ్వకుండా పూర్తి కేబినెట్ ను ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తోంది. 80 శాతానికి పైగా ఎమ్మెల్యే సీట్లు సాధించడంతో కేబినెట్ కూర్పుపై అసమ్మతి వచ్చే అవకాశం ఏ కోశానా ఉండే అవకాశం లేదు.