Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం: క‌రోనా బాధితుడి అంత్య‌క్రియలు అడ్డగింత‌పై అస‌హ‌నం

By:  Tupaki Desk   |   30 April 2020 4:40 PM IST
సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం: క‌రోనా బాధితుడి అంత్య‌క్రియలు అడ్డగింత‌పై అస‌హ‌నం
X
కరోనా వైరస్‌ సోకిన వారు మ‌నుషులేన‌ని.. అది ఒక వ్యాధి వ‌చ్చినంత మాత్రాన‌ అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. క‌ర్నూలు జిల్లాలో క‌రోనాతో మృతిచెందిన వ్య‌క్తి అంత్య‌క్రియ‌ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను సీఎం ఆదేశించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడాన్ని అమానవీయమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆప్యాయత, -సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని తెలిపారు.

క‌రోనా వైర‌స్ నివారణ చర్యలు - లాక్‌ డౌన్ అమ‌లు త‌దిత‌ర వాటిపై గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని తన నివాసంలో గురువారం ముఖ్య‌మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌పై అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. కరోనా వైర‌స్ వస్తే భయానకంగా, అది సోకినవారిని అంటరాని వారిగా చూడవద్దని హిత‌వు ప‌లికారు. వైరస్‌ సోకితే సరైన చికిత్స - మందులు తీసుకుంటే నయమైపోతుందని స్ప‌ష్టం చేశారు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దని స‌మావేశంలో తెలిపారు.

ఈ క‌రోనా వైర‌స్‌ పై అధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌జ‌ల‌కు ఈ విష‌య‌మై చైత‌న్యం చేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపైనే క‌రోనా వైరస్‌ అధిక ప్రభావం చూపుతోంద‌ని తెలిపారు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స పొందితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు.