Begin typing your search above and press return to search.

సీఎం చేతుల మీదుగా 'జగనన్న స్వచ్ఛ సంకల్పం' ప్రారంభం .. ఎప్పుడంటే

By:  Tupaki Desk   |   27 Sep 2021 9:17 AM GMT
సీఎం చేతుల మీదుగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం .. ఎప్పుడంటే
X
గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా, గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయనుంది. అలాగే, పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్య.

సైడ్‌ కాల్వలు శుభ్రం చేసేందుకు చాలాచోట్ల కూలీలు ముందుకు రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూలీ రేటు ఎక్కువగా డిమాండ్‌ చేస్తుండడం తో ఈ పని గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారింది. దీంతో ఈ సమస్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా చెక్‌ పెట్టనుంది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట 2,600 చెత్త సేకరణ వాహనాల్ని గాంధీ జయంతి నాడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడ బెంజి సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొంది. కార్యక్రమంలో భాగంగా కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది.

చెత్త రవాణా కోసం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలను పంపిణీ చేస్తాం. పదివేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలు, పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు 1,000 ఆటోలు పంపిణీ చేయనున్నాం. వీటితో పాటు జీవ వ్యర్థాల్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చేందుకు వీలుగా 6,417 పరికరాల్ని పంచాయతీలకు ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తాం. చెత్త సేకరణ, రవాణా కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,800 ఎలక్ట్రిక్‌ ఆటోలు పంపిణీ చేయనున్నాం’ అని పేర్కొంది.

ప్రతి మండలంలోని మురుగు కాల్వల్లో పూడిక తీయడంతో పాటు కాల్వల పక్క పెద్దస్థాయిలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడానికి డివిజన్‌కు ఒకటి చొప్పున బాబ్‌ కాట్‌ మిషన్లను గ్రామాలకు అందుబాటులో ఉంచనుంది. దీనికి తోడు, గ్రామాల్లో సాధారణ మురుగు తొలగించడానికి మండలానికి ఒకటి చొప్పున మెకనైజ్డ్‌ డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టరు నడపడం వచ్చినవారు ఈ మిషన్‌ ద్వారా రోజుకు 6–8 కి.మీ. పొడవున మురుగు కాల్వలను శుభ్రంచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.