Begin typing your search above and press return to search.

ఇసుక మాఫియాపై జగన్ వార్ డిక్లేర్

By:  Tupaki Desk   |   1 Oct 2019 10:16 AM GMT
ఇసుక మాఫియాపై జగన్ వార్ డిక్లేర్
X
అదే పనిగా చెలరేగిపోతున్న ఇసుక మాఫియాపై యుద్ధం ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక మాఫియా అన్నదే కనిపించకూడదన్న విస్పష్ట ఆదేశంతో పాటు.. 60 రోజుల గడువును నిర్దేశించారు. ఇసుక రవాణాకు ఎవరు ముందుకొచ్చినా సరే.. వారికి ఆ బాధ్యత అప్పగించాలని.. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకి ఎవరు ముందుకు వచ్చినా వారిని ప్రోత్సహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. డీజీపీ గౌతమ్ సవాంగ్.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి జిల్లాలోని ఎస్పీలు.. కలెక్టర్లు.. ఇతర ముఖ్య అధికారులతో రివ్యూ చేసిన జగన్.. ఇసుక కొరతను వెనువెంటనే అధిగమించాలని నిర్ణయించారు.

ఇసుక రవాణా కోసం వాహనాల ఎంపిక నేపథ్యంలో ఎవరికైనా అవకాశం ఇవ్వాలన్న జగన్.. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రస్తుతం వరదలు తగ్గటం.. ఇసుక లభ్యత పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరలకే ఇసుకను అందించాలని.. రానున్న 60 రోజుల్లో మార్పు కచ్ఛితంగా రావాలన్నారు.

జిల్లాల్లో ఇసుక సరఫరా.. రవాణా బాధ్యతల్ని జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని.. వారు కేవలం ఇసుక రవాణా.. సరఫరాలను మాత్రమే చూడాలన్నారు. ప్రతి జిల్లాలోనూ 2 వేల మంది నిరుద్యోగులైన ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు చెందిన యువకులతో పాటు కాపుల్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేసి వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని సిద్ధం చేయాలన్నారు.

రాజకీయ జోక్యన్ని ఎక్కడా అనుమతించరాదని.. గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి తేడా కచ్ఛితంగా ఉండాలన్న జగన్.. ఇసుక విషయంలో లెక్క తేల్చేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇసుక బయట రాష్ట్రాలకు వెళ్లకూడదన్నారు. ఇసుక మాఫియా మీద జగన్ పూరించిన సమరంలో మార్పులు ఏ విధంగా ఉంటాయన్నది తేలాలంటే 60 రోజులు వెయిట్ చేయక తప్పదు.