Begin typing your search above and press return to search.

జ‌న‌సేన.. నా సేన కోసం నా వంతు కార్య‌క్ర‌మం అందుకేనా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 11:30 PM GMT
జ‌న‌సేన.. నా సేన కోసం నా వంతు కార్య‌క్ర‌మం అందుకేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటును సాధించిన జ‌న‌సేన పార్టీ ప‌డుతూ లేస్తూ త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తోంది. మిగ‌తా పార్టీల్లాగా ఆర్థికంగా భారీ విరాళాలు ఇచ్చేవారు ఎవ‌రూ లేక‌పోయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు, జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లే ఇప్ప‌టికీ పార్టీ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌నల‌తోపాటు రాష్ట్రంలో పార్టీ త‌ర‌ఫున చేస్తున్న కార్య‌క్ర‌మాలు కూడా స్వ‌చ్ఛందంగా కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు వేసుకుని చేస్తున్న‌వే.

సాధారణంగా అన్ని పార్టీల‌కు కార్పొరేట్ సంస్థ‌లు, బ‌డా పారిశ్రామిక‌వేత్తలు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు. అయితే అధికారంలోకి వ‌స్తాయ‌నుకున్న పార్టీల‌కే ఈ భారీ మొత్తాలు ద‌క్కుతుంటాయి. అయితే జ‌న‌సేనలో పారిశ్రామిక‌వేత్త‌లు ఎవ‌రూ లేక‌పోవ‌డం, విరాళాలు కార్పొరేట్ సంస్థ‌ల నుంచి లేక‌పోవ‌డంతో ఆర్థిక క‌ష్టాలు చుట్టుముట్టాయ‌ని చెప్పుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌నసేన పార్టీ విరాళాల సేక‌ర‌ణకు.. నా సేన కోసం నా వంతు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. జ‌న‌సేన పార్టీ ముఖ్య నేత, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు ఈ కార్య‌క్ర‌మం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 7288040505@icici అనే ఐడీకి గూగుల్ పే, ఫోన్ పే త‌దిత‌రాల ద్వారా విరాళాలు చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న స్వ‌చ్ఛంధంగా త‌న విరాళం అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స్వ‌శ‌క్తితో, స్వార్జితంతో సంపాదించిన సొమ్మును పార్టీకి వెచ్చించార‌ని తెలిపారు. కార్య‌క‌ర్త‌లు ఇచ్చే విరాళాల‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తామ‌ని చెప్పారు. పార్టీగా అండ‌గా మ‌న వంతుగా విరాళాలు ఇద్దామ‌ని పిలుపునిచ్చారు.

నా సేన కోసం నా వంతుకు సంబంధించి 32 మందితో క‌మిటీని కూడా జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేసింది. క‌మిటీ చైర్మ‌న్‌గా బొంగునూరి మ‌హేంద‌ర్‌రెడ్డి, క‌న్వీన‌ర్‌గా తాళ్లూరి రామ్‌ల‌ను నియ‌మించారు. 3.5 లక్ష‌ల మంది జ‌న‌సేన పార్టీ క్రియాశీల‌క స‌భ్యులు, ఐటీ విభాగం, సోష‌ల్ మీడియా విభాగం, జ‌న‌సేన వీర మహిళ‌లు, ఎన్ఆర్ఐ విభాగం, మండ‌ల‌, జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జులు, జ‌న‌సేన పార్టీ అనుబంధ విభాగాలు, మ‌హిళ‌, యువ‌త‌, విద్యార్థులు అంతా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాముల‌వ్వాల‌ని నాగబాబు పిలుపునిచ్చారు.

కాగా ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ వెబ్‌సైట్‌లో విరాళాల సేక‌ర‌ణ కోసం ప్ర‌త్యేక ఆప్ష‌న్ అందుబాటులో ఉంది. దాని ద్వారా చాలామంది అబిమానులు, కార్య‌క‌ర్త‌లు విరాళాలు అందిస్తున్నారు. అయితే రానున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేయాల్సి రావ‌డం, అక్టోబ‌ర్ 5 నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రాష్ట్రంలో బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో పార్టీ విరాళాల సేక‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టింద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు రాష్ట్రంలో ఆత్మ‌హ‌త్యలు చేసుకున్న కౌలు రైతుల‌కు జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర నిర్వ‌హిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వారి కుటుంబ స‌భ్యుల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీ పరమైన ఖర్చులు పెరుగుతాయని.. వాటిని తట్టుకోవాలంటే విరాళాల సేకరణ త‌ప్ప‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.