Begin typing your search above and press return to search.

జావడేకర్..మరీ ఇన్ని అబద్ధాలా ?

By:  Tupaki Desk   |   29 May 2021 12:30 PM GMT
జావడేకర్..మరీ ఇన్ని అబద్ధాలా ?
X
కోవిడ్ టీకాల విషయంలో కేంద్రం చెబుతున్న అబద్ధాలకు అంతులేకుండా పోతోంది. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జావడేకర్ మాట్లాడుతు డిసెంబర్ నాటికి దేశమంతా టీకాల కార్యక్రమం పూర్తయిపోతోందని చెప్పారు. డిసెంబర్ చివరికల్లా 108 కోట్లమందికి 216 డోసుల టీకాలు ఇచ్చేట్లుగా కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ బ్లూప్రింట్ రెడీ చేసిందన్నారు. టీకాలు వేయించటంలో ప్రపంచ దేశాల్లో భారత్ రెండో దేశంగా నిలిచిందన్నారు.

జవడేకర్ చెప్పిన మాటలు విన్న శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులతో పాటు మామూలు జనాలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలకు మంత్రి చెప్పిన లెక్కలకే ఏమాత్రం పొంతనలేదు. గడచిన ఐదు మాసాలుగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా ఇప్పటికి టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 20 కోట్లుమాత్రమే. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఒక పద్దతి లేకుండా, సరైన ప్రణాళిక లేకపోవటం వల్లే అందరికీ టీకాల కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

టీకాల కార్యక్రమంలో నరేంద్రమోడి అనుసరిస్తున్న విధానాల వల్ల రోజురోజుకు జనాల్లో అయోమయం పెరిగిపోతోందే కానీ ఎక్కడా సజావుగా సాగటంలేదు. రాష్ట్రాలే టీకాలను ఫార్మా కంపెనీల నుండి సేకరించుకోవచ్చని ఒకసారి చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాలకు టీకాల సరఫరా చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనసరంటు కోర్టులో అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారు. అసలు టీకాల ఉత్పత్తే సక్రమంగా లేకపోయినా 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలంటు చేసిన ప్రకటన అబాసుపాలైంది.

ఒకవైపు దేశంమొత్తం మీద టీకాలను ఉత్పత్తిచేస్తున్నది రెండే కంపెనీలు. దేశవసరాలకు తగ్గట్లుగా టీకాలను ఉత్పత్తిచేయలేక రెండు కంపెనీలు చేతులెత్తేశాయి. పోనీ విదేశీకంపెనీలను అయినా అనుమతించారా అంటే అదీలేదు. ఫైజర్, మెడెర్నా లాంటి కంపెనీలు ముందుకొస్తే వాటిని కాదుపొమ్మని పంపేశారు. చివరకు స్పుత్నిక్ వి టీకాకు చాలా రోజుల తర్వాత అనుమతించారు. ఇపుడు టీకాల కార్యక్రమం గందరగోళంలో పడిన తర్వాత మళ్ళీ ఫైజర్, మొడెర్నా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు.

అగ్రరాజ్యం లాంటి అమెరికాలోనే అందరికీ టీకాల కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగటంలేదు. దేశ జనాభా 33 కోట్లలో ఇప్పటికి టీకాలు వేయగలిగింది కేవలం 16 కోట్లకు మాత్రమే. జనాలందరికీ వ్యాక్సినేషన్ వేయించటంలో టీకాలకు అమెరికాలో ఎలాంటి కొరతలేదు. అయినా అనుకున్నంత స్పీడుగా సాగటంలేదు. అలాంటిది టీకాల కొరత, సరైన ప్రణాళికలు లేకుండా సాగుతున్న మనదేశంలో డిసెంబర్ నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేయిస్తామన్న జవడేకర్ మాటలను ఎవ్వరు నమ్మటంలేదు.