Begin typing your search above and press return to search.

అమ్మ‌...చాలా అతి చేశారేందుకు?

By:  Tupaki Desk   |   5 Dec 2015 4:41 PM GMT
అమ్మ‌...చాలా అతి చేశారేందుకు?
X
చెన్నై వ‌ర‌ద....గ‌త నాలుగురోజులుగా ప్ర‌పంచం అంతా మాట్లాడుకుంటున్న టాపిక్ ఇది. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అందించేందుకు ఆయా వ‌ర్గాలు తమ‌కు తోచిన విధంగా ముందుకు వ‌చ్చాయి. కేంద్ర రాష్ర్ట ప్ర‌భుత్వాలు కూడా పెద్ద ఎత్తున్నే ముంద‌డుగు వేశాయి. అయితే స‌హాయాల్లో రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వంతో స‌హా వివిధ సంస్థ‌లు అందిస్తున్న స‌హాయ సామాగ్రిపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స్టిక్క‌ర్ వేసి మ‌రీ పంపిణీ చేస్తున్నారట. ఈ మేర‌కు ఆధారాల‌తో స‌హా సోష‌ల్ మీడియా - మీడియాలో ప్ర‌సారం అయ్యాయి. దీంతో తమిళనాడు సీఎం జయలలితపై ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రజలకు సరఫరా చేసే వస్తువులు, పదార్థాలపై జయలలిత స్టిక్కర్ వేయడం ఇపుడు త‌మిళ‌నాడులో వివాదాస్పదంగా మారింది. కోయంబత్తూరు నుంచి వస్తువులతో వచ్చిన వాహనాలను శ్రీ పెరంబుదూర్ వద్ద ఆపి జయ స్టిక్కర్లను వేశారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వస్తున్న వ‌స్తువుల‌పై కూడా స్టిక్క‌ర్ లు వేస్తున్నారు.అమ్మ స్టిక్కర్లతో వస్తువులను సరఫరా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తూ...ఇలా చేయడం హాస్యాస్పదంగా ఉందని సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో జ‌య‌పై సెటైర్ లు పేల్చుతున్నారు.

ఇదిలాఉండ‌గా...చెన్నై ఏర్‌ పోర్ట్‌ శనివారం పాక్షికంగా పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరడానికి మాత్రమే పౌరవిమానయాన శాఖ డైరక్టర్‌ జనరల్‌ అనుమతి ఇచ్చారు. టెర్మినల్‌ మాత్రం ఇంకా సిద్ధంగా కాలేదు. పూర్తిగా పనిచేయడానికి మరికొంత సమయం పట్టే వీలుంది. మ‌రోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు వీలుగా 13 హెలికాప్టర్లు - అడ్వాన్స్‌ డ్‌ హెలికాప్టర్లు - ఏర్‌ క్రాప్ట్‌ సి 17, సి 130 లను రంగంలోకి దించారు. వీటిని బాధితులకు రిలీఫ్‌ మెటీరియల్‌ అందించేందుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు చెన్నై నుంచి కొన్ని రైళ్లను పంపేందుకు ఏర్పాట్లు జరిగాయి. మధురై - తిరుచురాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. శనివారంనాడు కొన్ని ప్రాంతాల పాల సరఫరా జరగ్గా, ఆదివారం పూర్తిస్థాయిలో ఉంటుందని తెలిపారు.

మ‌రోవైపు చెన్నై వరదల కారణంగా పాలూ - పళ్లూ - నీళ్ల దగ్గరనుంచి విమానాల ఛార్జీల వరకూ అన్నింటి ధరలూ నింగినంటుతున్నాయి. చెన్నైలో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో నగరానికి సమీపంలోని విమానాశ్రయాలకు వెళ్లే చెన్నై ప్రయాణీకులు మూడునాలుగు రెట్ల ధరతో విమానం టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో వాణిజ్య తరగతిలో ప్రయాణించాలంటే సాధారణ పరిస్థితుల్లో సుమారు పాతిక వేల వరకూ టికెట్‌ ధర ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర 50 వేలకు పైగా చేరింది. ఎయిర్‌ ఇండియా 51 వేల 750 రూపాయిలు వసూలు చేస్తోంది. ప్రయివేటు విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ 47 వేల రూపాయిలు వసూలు చేస్తోంది. వ‌ర‌ద బీభ‌త్సం న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న స‌మ‌యంలో వ్యాపార‌, పారిశ్రామిక‌వ‌ర్గాలు ఈ విధంగా దోచుకోవ‌డంపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.