Begin typing your search above and press return to search.

నిషీత్ యాక్సిడెంట్‌పై జేసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   10 May 2017 10:05 AM GMT
నిషీత్ యాక్సిడెంట్‌పై జేసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషీత్ మ‌ర‌ణంపై ఏపీకి చెందిన మ‌రో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విష‌యం ఏదైనా.. బోల్డ్ గా మాట్లాడే అల‌వాటున్న జేసీ.. మిగిలిన నేత‌ల‌తో పోలిస్తే.. కాస్త ఓపెన్‌గానే విష‌యాలు చెప్ప‌టం క‌నిపిస్తుంది. మంత్రి నారాయ‌ణ కుమారుడి దుర్మ‌రణంపై అనంత‌పురంలో మాట్లాడిన జేసీ దివాక‌ర్ రెడ్డి.. త‌న సంతాపాన్ని తెలియ‌జేస్తూ.. ధ‌న‌వంతుల పిల్ల‌ల్లో విచ్చ‌ల‌విడిత‌నం బాగా పెరిగిపోయింద‌న్నారు.
సంప‌న్నుల పిల్ల‌లు బార్ల‌కు.. ప‌బ్బుల‌కు వెళుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. రాత్రి ప‌ద‌కొండు గంట‌ల స‌మ‌యానికి బార్లు.. ప‌బ్బులు మూసేయాల‌న్నారు. ఇప్పుడున్న కాలంలో త‌ల్లిదండ్రులు.. పిల్ల‌లు.. పెద్ద‌లు అంతా బిజీబిజీగా ఉంటున్నార‌ని.. ఏ మ‌నిషికి అయినా ఎవ‌రికో ఒక‌రికి భ‌య‌ప‌డాల‌ని.. భ‌యం లేకుండా పోతే ఎలాగంటూ ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం.

ఇళ్ల‌కు పిల్ల‌లు ఎప్పుడు వ‌స్తారో.. ఇప్పుడు బ‌య‌ట‌కు వెళ‌తారో కూడా త‌ల్లిదండ్రుల‌కు తెలీని ప‌రిస్థితి ఉంద‌న్న ఆయ‌న‌.. పిల్ల‌ల కోసం టైం కేటాయించాల‌న్నారు. పిల్ల‌ల విష‌యంలో ఎక్కువ బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే అన్న ఆయ‌న‌.. తాను ప‌లుచోట్ల పిల్ల‌ల తీరును చూస్తున్నాను కాబ‌ట్టే ఈ విష‌యాల్ని చెబుతున్నాన‌న్నారు. తాను ఇక్క‌డ ఎవ‌రిని ప్ర‌త్యేకించి త‌ప్పు ప‌ట్ట‌టం లేద‌ని.. జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి మాత్ర‌మే తాను చెబుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. పిల్ల‌ల్ని కంట్రోల్ చేయాల్సి ఉంద‌న్న జేసీ.. డ‌బ్బులు సంపాదించేది పిల్ల‌ల కోస‌మే అన్న విష‌యాన్ని గుర్తించాల‌ని.. అలాంట‌ప్పుడు వారికే స‌మ‌యం కేటాయించ‌క‌పోతే ఎలా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. సంప‌న్నుల ఇళ్ల‌ల్లో పిల్ల‌ల తీరుపై జేసీ ఆవేద‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.