Begin typing your search above and press return to search.

ఏ పార్టీ వద్దు అంటున్న జేడీ

By:  Tupaki Desk   |   25 Dec 2022 12:30 PM GMT
ఏ పార్టీ వద్దు అంటున్న జేడీ
X
జేడీ లక్ష్మీ నారాయణగా ప్రముఖుడిగా నిలిచిన మాజీ సిబిఐ అధికారి మరో మారు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపదుతున్నారు. దానికి వేదికగా విశాఖనే ఆయన ఎంచుకున్నారు. విశాఖలోనే జేడీ గత మూడేళ్ళుగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి 2 లక్షల 88 వేల ఓట్లను గెలుచుకున్న జేడీ ఆ తరువాత కాలంలో ఆ పార్టీని వదిలేశారు.

ఆయన జేడీ ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారానే తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జేడీ భావజాలం వేరుగా ఉంటుంది. అది ట్రెడిషనల్ పార్టీలకు మింగుడుపడదు. ఆయన ప్రజలకే అధికారం అంటారు, రాజ్యాంగపరమైన మార్పులు కావాలని డిమాండ్ చేస్తారు. అవినీతి వ్యతిరేక పాలన కోరుతారు. ప్రజా ప్రతినిధులు కూడా అధికారులు మాదిరిగా జనాలకు తప్పనిసరిగా జవాబుదారులు కావాలంటారు.

ఇక రాజకీయాల్లోకి వచ్చాక పూర్తి స్థాయిలో దానికే అంకితం అయి పనిచేయాలని ఆయన కోరుకుంటారు. జేడీ ఆలోచనలకు ఏ రాజకీయ పార్టీతో పొసగదు అని అంటున్నారు. ఆయన సైతం యువతను ఎక్కువగా దృష్టిలో ఉంచుకుని ప్రసంగాలు చేస్తూ వచ్చారు.

ఆయన ఒక మోటివేటర్ గా ఉన్నారు. యువతతోనే మార్పు రావాలని చూస్తున్నరు. అలాగే ప్రజలలో ప్రశ్నించే తత్వం రావాలని వారు తాము ఓట్లేసి గెలిపించిన నేతలను నిలదీయాలని కోరుకుంటారు.

అటువంటి జేడీకి ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా ఆహ్వానం ఉంటుంది కానీ ఆయన మాత్రం చేరే విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తారు అని అంటున్నారు. ఆయన కోరుకుంటే మరోసారి జనసేన నుంచి పోటీ చేయవచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. బీజేపీ ఉంది. కానీ జేడీ మాత్రం ఒంటరిగానే పోటీ అంటున్నారు.

తాను ఇండిపెండెంట్ గానే పోటీకి దిగుతాను అని చెబుతున్నారు. ఆ విషయాన్ని జేడీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ జగన్ మురారి తెలియచేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే జేడీ పోటీకి దిగుతారు అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జేడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హై కోర్టులో పోరాటం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తప్పు పడుతున్నారు. అలాగే ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకపోవడం మీద కూడా ఆయన అప్పట్లో కామెంట్స్ చేశారు.

దాంతో బీజేపీతో జేడీకి పొసగదు అని అర్ధం అయింది. ఇక ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీతోనే అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో జేడీ ఇండిపెండెంట్ గా ఉంటూ ప్రజల కోసం పోరాడడమే మేలు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా గత ఎన్నికల్లో 2.88 లక్షల ఓట్లు తెచ్చుకున్న జేడీ ఈసారి ఎన్ని ఓట్లను సొంతం చేసుకుంటారు ఆయన పోటీ చేయడం వల్ల ఏ రాజకీయ పార్టీని నష్టం అన్న చర్చ అయితే ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉన్నందువల్ల అప్పటికి సమీకరణలు పూర్తిగా మారుతాయని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.