Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఆశలు..ఆ పార్టీల మీదే - ఏమవుతుందో!

By:  Tupaki Desk   |   8 April 2019 5:46 AM GMT
కాంగ్రెస్ ఆశలు..ఆ పార్టీల మీదే - ఏమవుతుందో!
X
తాము ఇప్పుడు పరస్పరం తలపడుతున్నా.. ఎన్నికల తర్వాత మాత్రం ఆ పార్టీలు తమ వద్దకే వస్తాయని అంటున్నారు కాంగ్రెస్ ముఖ్య నేత జ్యోతిరాదిత్య సింధియా. ప్రత్యేకించి యూపీలోని రాజకీయ పరిస్థితి గురించి సింధియ ఈ వ్యాఖ్యలు చేశాడు. యూపీలో ఎస్పీ-బీఎస్పీలు పరస్పరం పొత్తుతో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీని అవి ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

కాంగ్రెస్ కు కొద్దో గొప్పో సీట్లు కేటాయించడం కూడా వేస్ట్ అన్నట్టుగా ఆ పార్టీని అవి పూర్తిగా పక్కన పెట్టేశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.

విశేషం ఏమిటంటే.. ఎస్పీ-బీఎస్పీ కూటమి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ వ్యతిరేక ఓటు మీదే ఆధాపడి ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకం అయిన ఓట్లు మాత్రమే వాటికి పడాలి. ఆ ఓట్లను వీరు చీల్చుకుంటూ ఉన్నారు. గతంలో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో పోటీ చేశాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పొత్తు పొడిచింది. అయితే వారిద్దరూ కలిసినా బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయారు. అప్పుడు బీఎస్పీ సోలోగా పోటీ చేసింది. చిత్తు అయ్యింది.

అలా ఒక కూటమికి, మరో పార్టీకి మధ్యన బీజేపీ వ్యతిరేక ఓటు చీలింది. ఇక ఇప్పుడు ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ పార్టీ సోలోగా రంగంలోకి దిగుతోంది. ఈ సారి కూడా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఎస్పీ-బీఎస్పీలు తమ మిత్రపక్షాలే అంటోంది.

ఎన్నికల తర్వాత అవి తమతోనే కలుస్తాయని జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించాడు. ఎస్పీ-బీఎస్పీలు బాగానే సీట్లను సాధించవచ్చు అనే అంచనాల నేపథ్యంలో..ఆ పార్టీల మద్దతు తమకే ఉంటుందని సింధియా ప్రకటించాడు. అవి బీజేపీ వ్యతిరేక పక్షాలు కాబట్టి.. సింధియా ఆశలు బాగానే ఉన్నాయి కానీ, అవి బేషరతుగా మద్దతు ఇస్తాయా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే!