Begin typing your search above and press return to search.

గజ్వేల్ లో కేఏ పాల్ అభ్యర్థి ఎవరో తెలుసా? ఆశ్చర్యపోవాల్సిందే..

By:  Tupaki Desk   |   3 Jun 2022 2:30 PM GMT
గజ్వేల్ లో కేఏ పాల్ అభ్యర్థి ఎవరో తెలుసా? ఆశ్చర్యపోవాల్సిందే..
X
రాజకీయాల పరమార్థం.. అధికారం. అందుకు సోపానం ఎన్నికలు. అయితే, అలా పార్టీ పెట్టి, ఇలా ఎన్నికల్లో పాల్గొని.. గెలిచేసి, అధికారంలోకి వచ్చేద్దామంటే కుదరదు. దీనికి ఎన్నో ప్రయాసలు ఎదుర్కోవాలి. అసలు పార్టీని నిలుపుకోవాలి. డబ్బుల ఖర్చుకు సిద్ధపడాలి. అభ్యర్థులను వెదుక్కోవాలి. వారు నిలదొక్కుకునేలా చూడాలి. ఈ రోజుల్లో అయితే గెలిచిన అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవాలి. వాస్తవానికి, చూస్తే ఎంత పెద్ద పార్టీకయినా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం కష్టమే. ప్రధాన పార్టీలు కూడా కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు దొరక్క తిప్పలు పడుతుంటాయి. అప్పటివరకు ఉన్న అభ్యర్థి/నాయకుడు వేరే పార్టీలోకి వెళ్లడమో, ఆ అభ్యర్థి ఆర్థిక పరిస్థితి ఎన్నికలను ఎదుర్కొనేంతగా లేకపోవడమో, సామాజిక సమీకరణాలు అనుకూలించకపోవడమో.. పొత్తులో వేరే పార్టీకి ఆ సీటును కేటాయించాల్సి రావడమో..? ఇలాంటి ఎన్నో కారణాలుంటాయి.

అభ్యర్థే పార్టీ ట్రేడ్ మార్క్

నియోజకవర్గం ఏదైనా పార్టీలకు అభ్యర్థే ట్రేడ్ మార్క్. అతడి లేదా ఆమె గుణగణాలు చూసే ప్రజలు మొగ్గుచూపుతుంటారు. కొన్నిసార్లు పార్టీ బలంగా ఉన్నా అభ్యర్థి బలహీనంగా ఉండి ఓడిన సందర్భాలున్నాయి. ఇంకొన్నిసార్లు అభ్యర్థి బలహీనంగా ఉండి పార్టీ బలంతో గెలిచిన ఉదంతాలున్నాయి. మరికొన్నిసార్లు రెండు అంశాలూ బలహీనంగా ఉన్నా.. రాజకీయల గాలిలో విజయం సాధించిన సంగతిని చూశాం.

పాల్ వ్యూహం అదుర్స్..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిచయం అక్కర్లేని పేరే కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్). ఆయనది ఒకప్పుడు ప్రపంచ స్థాయి. ఎవాంజలిస్ట్ గా అనేక దేశాలు తిరిగిన అనుభవం. ఎందరో దేశాధినేతలతో సమావేశమైన స్థాయి. కొంతకాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాల్ ఓ ప్రయత్నం చేసి చూద్దామనే ధోరణిలో వెళ్తున్నారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు.. అంటే 2009 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీలోనూ పాల్ కొంత హడావుడి చేశారు. అప్పటికి పార్టీ పెట్టలేదు.

ప్రజాశాంతి పార్టీతో అడుగులు

2019 ఏపీ ఎన్నికలకు ముందు ఏపీలో పాల్ సందడి మొదలైంది. నాటి ఎన్నికల్లో ఏపీలోని నరసాపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఏపీలో అభ్యర్థులనూ పోటీకి నిలిపారు. ఆ తర్వాత బి ఫారమ్ లు ఎత్తుకెళ్లారని ఏదో ఆరోపణలు చేశారు. చివరకు ఏపీలో ఆ పార్టీకి వచ్చింది నామమాత్ర ఓట్లే. ఇక ఈసారి మాత్రం పాల్ తన కార్యక్షేత్రంగా తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా తెలంగాణ మీదనే కన్నేసిన ఆయన ఇక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు.

అమరుడి తండ్రికి టిక్కెటిస్తారట..

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉద్విగ్న ఘట్టం శ్రీకాంతాచారి అమరత్వం. 2009లో ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లింది. అనంతరం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ సైతం ఓ మెట్టు దిగి.. అన్ని వర్గాలు, పార్టీలతో జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని రగలించింది. అయితే, 2014లో తెలంగాణ సాకారం తర్వాత శ్రీకాంత చారి తల్లి టీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం వస్తుందని భావించినా నెరవేరలేదు. 2018 ఎన్నికల్ల్లోనూ సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఈ అంశం ప్రతిపక్షాలకు ఓ ఆయుధమే.

శ్రీకాంతాచారి తల్లికి ఒక్క పదవీ ఇవ్వలేకపోయారే అంటూ అవి కేసీఆర్ ను ప్రశ్నిస్తుంటాయి. కాగా, ఇప్పటివరకు ఏ పార్టీ అయినా శ్రీకాంతా చారి తల్లికి టిక్కెట్ ఇస్తామని/ఇవ్వలేదని ప్రకటించడమో, ప్రశ్నిండచమో చేశాయి. పాల్ మాత్రం.. ఏకంగా శ్రీకాంత్ తండ్రికి గజ్వేల్ నియోజకవర్గ టిక్కెట్ ఇస్తానని ప్రకటించారు. గజ్వేల్ సీఎం కేసీఆర్ మీద శ్రీకాంతాచారి పోటీ చేయడం అంటే అక్కడివరకు గెలుపోటములను ప్రభావితం చేయకున్నా.. మిగతా రాష్ట్రంపై దానిమీద చర్చ జరుగుతుంది. కాబట్టి.. ఇది ఓ రకంగా ఆశ్చర్యకర ప్రకటనే. మిగతా పార్టీలకు రాని ఆలోచన పాల్ కు వచ్చినందుకు అందరూ ఔరా అంటున్నారు.