Begin typing your search above and press return to search.

కమల్ ను చంపుతామంటోంది ఎవరు?

By:  Tupaki Desk   |   15 Sept 2017 11:11 AM IST
కమల్ ను చంపుతామంటోంది ఎవరు?
X
ప్రస్తుత రాజకీయాలపై, తమిళనాడులోని రాజకీయ పరిస్థితులపై జయలలిత చనిపోయినప్పటి నుంచి వరుసగా సెటైర్లు, విమర్శలు చేస్తూ వస్తున్న లోక నాయకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ను చంపబోతున్నారా? అంటే అవునని ఆయనే చెబుతున్నాడు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయంట. అయితే తాను అలాంటి బెదిరింపులకు భయపడబోనని ఆయన అంటున్నాడు. ఈ సందర్భంగా తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఇతర ఏ పార్టీల్లో చేరబోనని కమల్ కుండబద్ధలు కొట్టాడు. జయలలిత మరణించినప్పటి నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వం పైన కమల్ చేస్తున్న అవినీతి ఆరోపణలతో ఆ పార్టీ నేతలు కమల్ పై మాటల దాడి చేశారు. జయలలిత జీవించి ఉన్నప్పటి నుంచే ఆ పార్టీతో కమల్ కు వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గతంలో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ పంచె కట్టుకున్నవ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే చూడాలని వ్యాఖ్యానించాడు.

ఇది తమిళనాడు రాజకీయాల్లో ఇద్దరికి వర్తిస్తుంది. ఒకరు డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాగా, మరో్ నేత అప్పటి కేంద్ర పభుత్వంలో హోం శాఖా మంత్రిగా ఉన్న చిదంబరం. కరుణానిధి, చిదంబరంలపై జయలలితకు పీకలదాకా కోపం ఉండేది. కమల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో మనసులో పెట్టుకున్న జయ అదును కోసం వేచి చూశారు. కమల్ నటించిన విశ్వరూపం విడుదల సందర్భంగా అందులో వివాదాస్పద అంశాలున్నాయంటూ విడుదల కానీయకుండా కమల్ కు నిజంగానే జయ విశ్వరూపం చూపారు. అప్పట్లో మీడియా సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నకమల్.. దేశం విడిచిపోతానంటూ తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తర్వాత జయ మరణించిన సందర్భంలోనూ కమల్ ట్వీట్లు వివాదస్పదమయ్యాయి. అప్పటి నుంచి ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని, ఆయన మంత్రివర్గ సహచరులను ఇబ్బంది పెడుతూ కమల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవండీ.. అన్నాడీఎంకేతో కమల్ కున్నగొడవలు.

ప్రస్తుతం త‌మిళ‌నాడులో ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కమల్ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముందు తాను పౌరుడిగా నా భావాలను పంచుకుంటున్నానన్న కమల్ తర్వాత తన వ్యాఖ్యలను పెంచారు. ఈ ఏడాది నవంబర్‌ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల‌ని కమల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలో మార్పు అవసరమ‌ని ఆ మార్పు త‌న‌తోనే, తమిళనాడు నుంచే రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రతి పార్టీకీ ఒక సిద్ధాంతం ఉంటుందని కమల్ హాసన్ అన్నారు. త‌న‌ జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నాన‌ని, వారితో ఫొటోలు దిగానని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేద‌ని చెప్పారు. త‌న‌ ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క లేదని చెప్పడం గమనార్హం. శశికళను తొలగించడం, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడం మంచి ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిపోయిందని అన్నారు. 'ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాకుండా, నాయ‌కులు ఓట్ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటనే వారిని తొల‌గించగలిగే రాజకీయ వ్యవస్థ మనకు కావాలి' అన్నారు. భార‌త‌ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే తాను చెబుతోన్న ఐడియానే మంచి మార్గమ‌ని కమల్ చెబుతుండటం విశేషం.