Begin typing your search above and press return to search.

సోముతోనే సమస్యంతా...బీజేపీలో రాజుకున్న అగ్గి

By:  Tupaki Desk   |   19 Oct 2022 10:36 AM GMT
సోముతోనే సమస్యంతా...బీజేపీలో రాజుకున్న అగ్గి
X
బీజేపీలో అగ్గి రాజుకుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కరచాలనం చేయడంతో ఏపీ బీజేపీలో వర్గ పోరు కూడా బయటపడింది. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వల్లనే ఈ సమస్యంతా అని మాజీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ బీజేపీకి దూరం జరుగుతున్నారు. రేపటి రోజున పొత్తు లేదు అని పవన్ కనుక చెబితే మాత్రం ఆ బాధ్యత అంతా సోము వీర్రాజునే అని కన్నా తనదైన మార్క్ విమర్శలు చేశారు.

బీజేపీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీలో కాంగ్రెస్ మాదిరిగా నాయకులు బయటపడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. అయితే కన్నా స్కూల్ అంతా కాంగ్రెస్ ది. మరి ఆయన బీజేపీలో చాలా కాలం క్రితమే చేరారు. ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఆయన హయాంలోనే బీజేపీతో జనసేన దోస్తీ కుదిరింది. ఆ తరువాత వచ్చిన సోము వీర్రాజు ఎందుకో పవన్ని పట్టించుకోలేదని బీజేపీలో ఒక వర్గం ఎప్పటి నుంచో గుస్సా అవుతోంది.

బీజేపీలో ప్రో వైసీపీ విధానాలు కొందరు నేతలు అమలు చేస్తున్నారు అన్న అసంతృప్తి కూడా నేతలలో ఉందిట. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఏవీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకురాకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల వల్లనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో విసిగి చంద్రబాబుతో చేతులు కలిపారు అని అంటున్నారు.

దాంతో ఏపీలో బీజేపీకి ఎటూ దారి లేక ఒంటరిది అయింది. దాంతో ఇపుడు పవన్ యాక్షన్ బీజేపీలో చిచ్చు రేపుతోంది. రేపటి రోజున ఏపీలో కమలం వికసించేందుకు దారేదీ అన్న చర్చ సాగుతోంది. అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సోము వీర్రాజు తనదే పెత్తనం అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు అన్నదే బీజేపీలో సీనియర్ల మనో వేదన. అలాంటి అభిప్రాయలనే కన్నా లక్ష్మీ నారాయణ కూడా బయటపెట్టారు.

అసలు బీజేపీలో ఏం జరుగుతోంది అన్నది తన లాంటి నాయకులకే తెలియడం లేదని, అంతా సోము తోనే సమస్యగా ఉందని ఆయన బాణాలు ఎక్కుపెట్టారు. అంతే కాదు బీజే హై కమాండ్ ఈ విషయంలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఒక వైపు హై కమాండ్ పిలిచిందా లేక తానే వెళ్లారా తెలియదు కానీ సోము వీర్రాజు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో కన్నా అసమ్మతి గళం విప్పారు. ఆయన బీజేపీలో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. దాంతో హై కమాండ్ సోము విషయంలో ఏమైనా సీరియస్ గా ఆలోచించి కొత్త నాయకత్వాన్ని ప్రకటిస్తుందా లేక కన్నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుందా అన్నది చూడాలి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో అన్ని పార్టీ కలసి ముందుకు అడుగులు వేయాలని కన్నా కోరడం విశేషం. అంటే ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరాలన్నది బహుశా ఆయన అభిప్రాయం అయి ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి కేంద్ర నాయకత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.